KCR | సిటీబ్యూరో : మెట్రో విస్తరణ విషయంలో గత సీఎం కేసీఆర్ ఎంతో ముందు చూపుతో వ్యవహరించారు. మొదటి దశలో పూర్తయిన 69 కి.మీ మెట్రో కారిడార్లను నగరం నలుమూలలా విస్తరించేలా.. రెండు, మూడు దశలకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించే బాధ్యత హైదరాబాద్ మెట్రో రైలు సంస్థకు అప్పగించారు. మహానగరంలో పదేండ్లలో 414 కి.మీ మెట్రో నెట్వర్క్ను విస్తరించాలని నిర్ణయించారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెట్రోపై నిర్లక్ష్యం చూపుతున్నది.
అందుకు నిదర్శనం కేవలం 78.4 కి.మీ మెట్రో మార్గాన్ని నిర్మించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో మార్గాలను పూర్తిగా పక్కన పెట్టి పరిమిత మార్గాల్లోనే కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. అందులోనూ 3 మెట్రో మార్గాలు భవిష్యత్ అవసరాలకు ఏమాత్రం సరిపోవని ఒకవైపు పట్టణ ప్రణాళిక నిపుణులు, మెట్రో అధికారులు చెబుతున్నా పట్టించుకోకుండా మెట్రో విస్తరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.