మారేడ్పల్లి, జూలై 2: విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. మారేడ్పల్లి లోని కస్తూర్భా గాంధీ డిగ్రీ, పీజీ మహిళా కళాశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కస్తూర్భా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కస్తూర్భా గాంధీ పేరుతో స్థాపించిన ఈ కళాశాల మహిళా సాధికారితకు విశేషంగా కృషి చేస్తున్నదన్నారు. భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత కాలంలో కళాశాలల్లో డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ తదితర కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు.
కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ చైర్పర్సన్ మల్లు నందిని, ప్రత్యేక అతిథులుగా ప్రొఫెసర్ టీవీ గోపాలాచారి, ఓజీఏ ప్రెసిడెంట్ సత్యేందర్ వనం, ఎగ్జిబిషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ బీఎన్ రాజేశ్వర్ రావు, ఓసీఓ సెక్రటరీ బి.హనుమంతరావు, ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రటరి ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఓయూ రిజిస్ట్రార్, ఇంకా కళాశాల చైర్మన్ అశోక్ గోపతి, సెక్రటరి, కరస్పాండెంట్ మహ్మద్ ఫహీముద్దీన్, ఉమా మహేశ్వర్ రావు, వైస్ చైర్మన్ డి.సురేష్ కుమార్, జాయింట్ సెక్రటరి డాక్టర్ ఎం.శైలజరాజ్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్.రాజశ్రీలత, రిటైర్డు ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది వివిధ కళాశాలల ప్రధానోపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి చేతుల మీదుగా కళాశాల సావెనీర్ ఆవిష్కరించారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు స్వర్ణ పతకాలను అందజేశారు.
ఐదు దశాబ్దాల చరిత్ర ఎస్పీ కళాశాలది
ఎందరినో తీర్చిదిద్దిన సర్దార్ పటేల్ కళాశాలది ఐదు దశాబ్దాల చరిత్ర అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కళాశాలను అభివృద్ధి చేయడంతో పాటు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఎస్పీ కళాశాల పాలక మండలి కృషి అభినందనీయమని కొనియాడారు. పద్మారావునగర్లోని సర్దార్ పటేల్ కళాశాలలో నూతన ఆడిటోరియం, కామర్స్ విభాగం భవనాలను మంగళవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన ఎస్పీ కళాశాలలో చదివిన ఎందరో విద్యార్థులు నేడు దేశ, విదేశాలలో ఉన్నతమైన స్థానాలలో ఉన్నారన్నారు. ఈ సందర్భంగా కళాశాల ఉత్తమ ఉద్యోగులైన పరిపాలనా అధికారి రాహుల్ యాదవ్, సూపరింటెండెంట్ జావిద్ హుస్సేన్లకు మంత్రి సన్మానం చేశారు. కళాశాల కార్యదర్శి బి.సురేందర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించి కళాశాలలో ఆడిటోరియం, కామర్స్ బ్లాక్లను నిర్మించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కళాశాల పాలక మండలి చైర్మన్ ఎస్.రాజేందర్, కార్యదర్శి బి.సురేందర్ రెడ్డి, కోశాధికారి సూరజ్ సింగ్, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు సత్యేందర్, సభ్యులు, కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.హేమలత, వైస్ ప్రిన్సిపాల్ ఎం.అమర్నాథ్ శర్మ, అధ్యాపకులు పాల్గొన్నారు.