Land Grabbing | బంజారాహిల్స్,మార్చి 15: జూబ్లీహిల్స్ రోడ్ నం. 70లోని జర్నలిస్ట్ కాలనీలో ఉన్న ఖరీదైన ప్రభుత్వ స్థలం ఆక్రమణలకు గురవుతోంది. షేక్పేట మండల పరిధిలోని సర్వేనంబర్ 403లో ఉన్న జర్నలిస్ట్ కాలనీకి, జూబ్లీహిల్స్ రోడ్ నం. 69 ఎఫ్కు మధ్య సుమారు రెండు ఎకరాల వరకు కొండలతో కూడుకున్న ప్రభుత్వ స్థలం ఉంది. కొంతకాలంగా జర్నలిస్ట్ కాలనీ లే అవుట్లోని ప్లాట్ నంబర్ 1 నుంచి 9 వరకు ఆయా స్థలాల్లో ఉంటున్నవారు.. తమ వెనుక ఉన్న కొండను తవ్వుకుంటూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఒక్కో ప్లాట్ వెనుకాల సుమారు 200 నుంచి 1200 గజాల స్థలం ఉండటంతో కొంతమంది ఏకంగా కొండను తవ్వేసి.. చదును చేసుకుని గార్డెన్స్ ఏర్పాటు చేసుకోగా, మరికొంత మంది సెక్యూరిటీ గదులు, క్రీడా స్థలాలు ఏర్పాటు చేసుకున్నారు.
సుమారు రూ.120 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేస్తున్నారంటూ ఇటీవల స్థానికులు సికింద్రాబాద్ ఆర్డీవో దశరథ్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం షేక్పేట మండల తాసీల్దార్ అనితారెడ్డి జర్నలిస్టు కాలనీని సందర్శించి.. కబ్జాకు గురైన స్థలాలను పరిశీలించేందుకు యత్నించగా.. ప్లాట్ నం. 7, 8కి చెందిన పురుషోత్తంరెడ్డి అనే యజమాని, అతడి కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. తాసీల్దార్తో వాగ్వాదానికి దిగారు. వీడియోలు తీస్తూ బెదిరింపు దోరణిలో మాట్లాడారు.
దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పురుషోత్తం రెడ్డికి చెందిన ప్లాట్ల వెనుకాల సుమారు 700 గజాలకు పైగా స్థలం ఆక్రమణకు గురైందని, ఈ స్థలంలో సెక్యూరిటీ గదులతో పాటు ప్లేగ్రౌండ్స్ ఏర్పాటు చేసుకున్నారని అధికారులు గుర్తించారు. ఈ ప్లాట్తో పాటు మరికొన్ని ప్లాట్ల వెనుకాల కూడా ఆక్రమణలు జరిగినట్లు గుర్తించామని, వాటిని తొలగించి ప్రభుత్వ హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేస్తామని షేక్పేట తాసీల్దార్ అనితారెడ్డి తెలిపారు. దీంతో పాటు ప్లాట్ నంబర్ 1 వెనుకాల అక్రమంగా కొండను తొలగిస్తున్నట్లు గుర్తించిన రెవెన్యూ అధికారులు పనులను ఆపేయించారు. సర్వే నిర్వహించిన తర్వాతే పనులు చేయాలని ఆదేశించారు.