సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ): నగరంలో అన్ని ఆస్పత్రుల్లో నమోదయ్యే డెంగీ కేసుల వివరాలను ఎప్పటికప్పుడు డీఎంహెచ్ఓకు తెలియజేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే వారిపై క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డెంగీ వ్యాధి నివారణపై హైదరాబాద్ కలెక్టరేట్లో మంగళవారం వైద్యాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అనుదీప్ మాట్లాడుతూ డెంగీ వ్యాధిని పూర్తిగా నివారించేందుకు వైద్యాధికారులు అప్రమత్తతతో విధులు నిర్వహించాలని, దోమల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు.
నగరంలోని అన్ని వార్డులు, సర్కిళ్లు, యూపీహెచ్సీల వారీగా 2019 నుంచి 2024 వరకు నమోదైన డెంగీ కేసుల గణాంకాలు తీసుకోవాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గృహాల్లో నీరు నిల్వ ఉండకుండా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో డెంగీ కేసులు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నందున వైద్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్, జీహెచ్ఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాంబాబు, చీఫ్ ఎంటమాలజిస్టు డాక్టర్ హర్ష పాల్గొన్నారు.