N Convention | ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ను శనివారం కూల్చివేశారు. ఈ కూల్చివేతలపై నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. తుమ్ముడికుంట చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్లలోని ఆక్రమణలు సిబ్బంది కూల్చివేశారన్నారు. హైడ్రా, జీహెచ్ఎంస్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారని తెలిపారు.
తుమ్మిడికుంట చెరువులోని అనధికార నిర్మాణాల్లో ఎన్ కన్వెన్షన్ సైతం ఒకటని, చెరువులోని ఎల్టీఎఫ్లో ఎకరా 12 గంటల్లో ఎన్ కన్వెన్షన్లో నిర్మించారన్నారు. బఫర్ జోన్లోని 2 ఎకరాల 18 గుంటల్లో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని.. ఎన్ కన్వెన్షన్కు జీహెచ్ఎంసీ నుంచి నిర్మాణ అనుమతులు లేవని తెలిపారు. బీఆర్ఎస్ కింద అనుమతుల కోసం ఎన్ కన్వెన్షన్ యత్నించిందని.. సంబంధిత అధికారులు బీఆర్ఎస్ అనుమతించలేదన్నారు. ఇదిలా ఉండగా.. ఎన్ కన్వెన్షన్ శనివారం ఉదయం హైడ్రా అధికారులు కూల్చివేగా.. దీనిపై నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు.
తమకు కూల్చివేతకు ముందు కనీసం నోటీసులు సైతం ఇవ్వలేదని.. ఒకవైపు కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా అర్ధాంతరంగా కూల్చివేయడం సరికాదన్నారు. దీనిపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ టీ వినోద్కుమార్ విచారణ చేపట్టి.. కూల్చివేత ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ పూర్తి కూల్చివేశారు.