Reels | బంజారాహిల్స్, జనవరి 25: ఇన్స్టా రీల్స్లో వ్యూస్ పెంచుకునే క్రమంలో డీ మార్ట్ స్టోర్లో చాక్లెట్స్ చోరీ చేయడంతో పాటు ఫ్రీగా చాక్లెట్స్ తినడం ఎలా.. అంటూ వీడియోలు చేసిన ఇద్దరిని ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. చందంపేట మండలం నేరేడుగొమ్మ గ్రామానికి చెందిన హనుమాన్ నాయక్(22) రాయదుర్గం సమీపంలో నివాసముంటూ.. ఓ కళాశాలలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలో ఉంటున్న ఘట్కేసర్కు చెందిన సిద్ధూ (25) అనే యువకుడితో కలిసి కొంతకాలంగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తయారు చేస్తున్నాడు. ఈ క్రమంలో షేక్పేట డీ మార్ట్ స్టోర్కు వెళ్లారు.
కౌంటర్లో ఉన్న రెండు చాక్లెట్స్ను తీసుకున్న హనుమాన్ నాయక్ వాటిని తీసుకొని జేబులో పెట్టుకోవడం.. ఒక షర్ట్ను తీసుకుని ట్రయల్ రూమ్లోకి వెళ్లి చాక్లెట్స్ తినడంతో పాటు వీడియోలు తీసి.. ఇన్స్టా రీల్స్గా పోస్ట్ చేశారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో డీ మార్ట్ యాజమాన్యం దృష్టికి వెళ్లాయి. ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. గురువారం పోలీసులు నిందితులు హనుమాన్ నాయక్, సిద్ధూలను అరెస్ట్ చేశారు.