HMDA | సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ): భూములను విక్రయించడం ద్వారా డబ్బులు రాబట్టాలని రేవంత్ సర్కారు చూస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలోని భూములను విక్రయించేందుకు ఉన్న అవకాశాలపై ప్రధానంగా దృష్టి సారించింది. గత కేసీఆర్ ప్రభుత్వంలో భూ సమీకరణ పథకం (ల్యాండ్ పూలింగ్ స్కీమ్) ద్వారా ప్రభుత్వ భూములు కాకుండా రైతులకు చెందిన పట్టా భూములను సేకరించి.. లే అవుట్లుగా అభివృద్ధి చేపట్టింది. ఇలా రంగారెడ్డి జిల్లా పరిధిలోని లేమూర్, ఇన్వుల్నర్మ ప్రాంతాలతో కలిపి సుమారు 200 ఎకరాల్లో హెచ్ఎండీఏ భారీ లే అవుట్లను అభివృద్ధి చేసింది. ఈ పనులు చివరి దశలో ఉన్నాయి.
అయితే ఈ లే అవుట్లలో హెచ్ఎండీఏ వాటా కింద వచ్చే భూములను విక్రయించడం ద్వారా డబ్బులు రాబట్టాలని ప్రభుత్వం హెచ్ఎండీఏపై ఒత్తిడి పెంచింది. ఈ నేపథ్యంలోనే లేమూర్, ఇన్వుల్నర్మ హెచ్ఎండీఏ లే అవుట్లకు సంబంధించిన ప్రధాన గేట్ల వద్ద ఆర్చీలను త్వరగా నిర్మించి, అందులోని ప్లాట్లను విక్రయించేందుకు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తొందర పెడుతోంది. ఇక ప్రభుత్వమే ఆదేశించడంతో పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో చేపట్టకపోయినా విక్రయించేందుకు వేగంగా ఏర్పాట్లు చేయాల్సి వస్తోందని హెచ్ఎండీఏ అధికారులు వాపోతున్నారు.
లేమూర్, ఇన్వుల్నర్మ ప్రాంతాల్లో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లే అవుట్లకు ముఖ ద్వారాలను( ఆర్చీలు) నిర్మించేందుకు రూ. 61.78 లక్షలతో ఇంజినీరింగ్ విభాగం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన పనులు వెంటనే చేపట్టేందుకు టెండర్లు సైతం ఇటీవలే పిలిచారు. పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపడితేనే లే అవుట్లో ప్లాట్ల విక్రయానికి అనుకూలంగా ఉంటుందనే ఆలోచనతో ప్రభుత్వం హెచ్ఎండీఏకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు తెలిసింది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్లో డిమాండ్ లేదని, ఇలాంటి సమయంలో ప్లాట్ల విక్రయాలు సరైన నిర్ణయం కాదని అధికారులు చెబుతున్నా.. వినిపించుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.