HMDA | సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 1 (నమస్తే తెలంగాణ)/మియాపూర్: మియాపూర్లోని హెచ్ఎండీఏ భూముల వ్యవహారం మరో మలుపు తిరిగింది. దశాబ్దాలుగా భూములు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోని హెచ్ఎండీఏ అధికారులు.. వేలాదిగా నిరుపేదలు వచ్చి గుడిసెలు వేసుకునేందుకు ప్రయత్నిస్తే గానీ మేల్కొనలేదు. ఈ నేపథ్యంలో ఆ భూముల్లో సంవత్సరాల కిందట వెలిసిన కాలనీలపై అధికారులు దృష్టిసారించారు. ఈ భూములు మీకెలా వచ్చాయో వివరణ ఇవ్వాలంటూ ఇంటి యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 100, 101 సర్వే నంబర్లలో 550 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న విషయం తెలిసిందే. 2003లోనే రెవెన్యూ శాఖ ఈ భూములను హెచ్ఎండీఏకు అప్పగించగా… కోర్టు కేసుల నేపథ్యంలో అధికారులు ఆ భూములను పట్టించుకోలేదు. కనీసం రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో కొంచెం కొంచెంగా… చివరకు వందెకరాలకు పైగా భూమి అన్యాక్రాంతమైంది. అందులో అనేక కాలనీలు వెలిశాయి. అయితే కొన్నిరోజుల కిందట వేలాది మంది నిరుపేదలు అందులో గుడిసెలు వేసేందుకు రావడంతో హెచ్ఎండీఏ అధికారుల్లో చలనం వచ్చింది. ఎట్టకేలకు పోలీసు శాఖ పెద్ద ఎత్తున బలగాలను మోహరించి, వారిని అక్కడి నుంచి పంపించారు. అయితే ఇప్పుడు ఆ భూముల రక్షణకు చర్యలు మొదలుపెట్టిన హెచ్ఎండీఏ… ఇప్పటికే చుట్టూ కందకం ఏర్పాటు చేసింది. ఫెన్సింగ్కు టెండర్లు పిలిచింది. ఇదే సమయంలో అన్యాక్రాంతమైన భూములపై దృష్టిసారించిన అధికారులు… సర్వే నంబర్ 100లో వెలిసిన ఎంఏనగర్లోని నిర్మాణాలకు నోటీసులు జారీ చేయడం మొదలుపెట్టారు. మరో 180 మందికి నోటీసులు జారీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. నోటీసు అందుకున్న పది రోజుల్లో తగిన పత్రాలతో తమ కార్యాలయంలో సమాధానం ఇవ్వాలని అధికారులు నోటీసులో పేర్కొన్నారు. కానీ నోటీసులు అందుకున్న వారు మాత్రం ఇప్పటివరకు ఎవరూ తమకు సమాధానం ఇవ్వలేదని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.
హెచ్ఎండీఏ అధికారులు ప్రస్తుతం ఆక్రమణలపై నోటీసులు ఇస్తుండటం తీవ్ర దుమారం రేపుతున్నది. అసలు ఈ నిర్మాణాల వెనక ఎవరు ఉన్నారనే దానిపై చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం అక్కడ నివాసం ఉంటున్నవారు నిరుపేదలు అయినప్పటికీ వారి నుంచి గతంలో కొందరు లక్షల రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు హెచ్ఎండీఏ అధికారులకు సైతం ఫిర్యాదులు అందుతున్నట్లు తెలిసింది. అయితే అధికారుల నోటీసులకు యజమానులు స్పందించి తమ డాక్యుమెంట్లను సమర్పిస్తే తప్ప.. అసలు సూత్రధారులు ఎవరనేది తెరపైకి రాదని అధికారులు అంటున్నారు.
మియాపూర్ సర్వే నంబర్ 100లో విలువైన భూమిని రక్షించేందుకు గతంలోనే బల్దియా కమిషనర్తో కలిసి తాము ప్రయత్నించినప్పటికీ కొందరు హెచ్ఎండీఏ అధికారులు అడ్డుపడి.. ముందడుగు పడకుండా చేశారని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. భూములు ఆక్రమణకు గురవుతున్నా కండ్లు మూసుకున్నారని మండిపడ్డారు. సోమవారం ఎంఏనగర్లో పర్యటించిన ఆయన… ఆ కాలనీవాసులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. కాగా, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు ఎంసీపీఐ ఆధ్వర్యంలో బాధితులు నిరసన చేపట్టి, కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు.