Hyderabad | సిటీబ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బుధవారం గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పలు రహదారులు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రి 8 గంటల వరకు బేగంబజార్లో అత్యధికంగా 8.55 సెం.మీలు, అత్యల్పంగా సరూర్నగర్లోని మధురానగర్లో 1.0 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ వెల్లడించింది.
రాగల రెండు రోజుల్లో గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా గ్రేటర్కు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. వర్షం ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 36.1, కనిష్ఠం 24.6 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 60 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.