బంజారాహిల్స్, జనవరి 10: పెళ్లి చేసుకుంటానంటూ యువతిని నమ్మించాడు. శారీరకంగా లోబర్చుకొని ఎనిమిదేళ్లుగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. తాజాగా.. మరో యువతితో సంబంధం పెట్టుకున్న ఆ యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. కోదాడకు చెందిన గంగినేని గణేశ్ (27) పదేళ్ల కిందట నగరానికి వచ్చి.. యూసుఫ్గూడలో ఉంటున్నాడు.
ఎనిమిదేళ్ల కిందట అతడికి ఓ యువతి పరిచయమైంది. ప్రేమిస్తున్నానని ఆమెను నమ్మించి సన్నిహితంగా మెలిగిన గణేశ్.. ఆమెను గదికి తీసుకెళ్లి శారీరకంగా లోబర్చుకున్నాడు. ఆమె వద్ద నుంచి డబ్బులు తీసుకొని జల్సాలు చేశాడు. బాధిత యువతిని పెళ్లి చేసుకుంటానని, ఉద్యోగం వచ్చిన తర్వాత తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తానంటూ నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన యువతి సర్వస్వం అర్పించింది.
ఆమె గర్భం దాల్చగా.. మూడుసార్లు అబార్షన్ చేయించాడు. ఇదిలా ఉండగా.. వరంగల్కు చెందిన మరో యువతితో సుమారు ఏడేళ్లుగా గణేశ్ శారీరక సంబంధం కలిగి ఉన్నట్లు ఇటీవల బాధితురాలికి తెలిసింది. ఈ విషయంపై నిలదీసేందుకు ఈనెల 8న అతడి గదికి వెళ్లింది. అలాంటిదేమీ లేదని, పెళ్లి చేసుకుందామంటూ గణపతి కాంప్లెక్స్ వద్దకు తీసుకొచ్చి స్నేహితులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఆమె ఫోన్ పగలగొట్టారు.
ఈ ఘటనపై బాధితురాలు రెండురోజుల కిందట జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. నేరం అంగీకరించాడు. అయితే, ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తేల్చి చెప్పాడు. బాధితురాలు బుధవారం మరో ఫిర్యాదును జూబ్లీహిల్స్ పోలీసులకు ఇచ్చింది. దీంతో గణేశ్తో పాటు ఇతర నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.