అసలే వర్షాకాలం.. ఆపై ఉన్నట్టుండి కురుస్తున్న కుండపోత వానలు.. పొంగిపొర్లే నాలాలు, చెరువులను తలపించే రహదారులు, లోతట్టు ప్రాంతాలను ముంచెత్తే వరద…వెరసి గ్రేటర్ వాసులకు కంటిమీద కునుకు లేకుండా పోతున్నది. వరద ముంపు తప్పించాల్సిన జీహెచ్ఎంసీ మాత్రం ఇంకా మొద్దు నిద్ర వీడడం లేదు. మాన్సూన్ పనులే కాకుండా కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలాల అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) మొదటి దశ పనులపై నిర్లక్ష్యం వహిస్తున్నది. 75 శాతం పైగా పనులను పూర్తి చేసి.. వందల కాలనీలు, బస్తీలకు వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం చూపింది గులాబీ సర్కారు. కానీ డిసెంబర్లో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చూపడంతో పురోగతిలో ఉన్న పనులను పూర్తి చేయలేక జీహెచ్ఎంసీ చేతులెత్తేసింది.
జీహెచ్ఎంసీ పరిధి, అవతల కలిపి రూ.985.45కోట్లతో చేపట్టిన మొదటి విడత ఎస్ఎన్డీపీ పనులు రూ.592.68కోట్లు ఖర్చు పెట్టి 39 చోట్ల పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసింది. కానీ కాంగ్రెస్ సర్కారు ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. ప్రస్తుతం రూ. 361.16 కోట్లతో 17 చోట్ల పనులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో ఈ 17 ప్రాంతాలు డెంజర్ జోన్లో ఉన్నాయి. సకాలంలో పనులు పూర్తి కాకపోతే ముంచెత్తే వరద నీటితో జీవితాలు అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉన్నదని ఆయా ప్రాంతాల వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా లంగర్హౌస్, కోమటికుంట, మీర్పేట తలాబ్, బడంగ్పేటలో న్యాయపరమైన చిక్కులతో పనులు నిలిచిపోయాయి. ఎస్ఎన్డీపీ పనులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.