మెహిదీపట్నం : తెలంగాణ ఆషాఢ మాసం బోనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం రేవంత్రెడ్డి 20 కోట్ల రూపాయల నిధులను కేటాయించారని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ (Minister Konda Surekha) అన్నారు. తెలంగాణ ఆషాఢ మాసం గోల్కొండ (Golkonda) కోట జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో నెల రోజుల పాటు జరిగే బోనాల(Bonalu) నిర్వహణపై ప్రభుత్వశాఖల అధికారులతో మంత్రి సురేఖ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గోల్కొండ బోనాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. ఈ ఏడాది తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్భంగా బోనాల ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడానికి సీఎం(CM) నిధులను కేటాయించారని పేర్కొన్నారు. గోల్కొండ కోటలో బోనాలను జరుపుకోవడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వ శాఖల అధికారులు అన్నీ రకాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
సమావేశానికి హాజరుకాని అధికారులపై మంత్రి మండిపడ్డారు. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) మాట్లాడుతూ గోల్కొండ కోటలో నీటికి కొరత ఉండరాదని, కోటకు వచ్చే రోడ్ల గుంతలను అన్నింటికి మరమ్మతులు పూర్తి చేయాలని, విద్యుత్ (Electricity ) సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్రెడ్డి, కార్వాన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్, దేవాదాయ కమిషనర్ హనుమంత్రావు, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంత్, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.