Jalamandali | సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ ) : నగర దాహార్తిని తీర్చడంలో ముఖ్యభూమిక పోషించే ఎల్లంపల్లి రిజర్వాయర్లో నీటి నిల్వలు ఆందోళనకరంగా మారడంతో జలమండలి అప్రమత్తమైంది. ఎల్లంపల్లి రిజర్వాయర్లో ప్రస్తుతం నీటి నిల్వలు 4.5 టీఎంసీల మేర ఉండగా, డేడ్ స్టోరేజీ 3.3 టీఎంసీల మేర రాగానే అత్యవసర పంపింగ్ అవసరం పడుతుంది. అయితే నెలకు దాదాపు ఒక టీఎంసీ మేర ఎల్లంపల్లి ద్వారా నగరానికి గోదావరి నీటిని తరలిస్తున్నారు.
నాలుగు టీఎంసీలకు చేరగానే అత్యవసర పంపింగ్ ద్వారానే రోజూ 172 ఎంజీడీలను తరలించే ఆస్కారం ఉంటుందని భావించిన అధికారులు.. ఎల్లంపల్లి రిజర్వాయర్ బ్యాక్ చానెల్ ముర్ముర్ ఫోర్సోర్ వద్ద అత్యవసర పంపింగ్ మోటర్లను ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఏడు పంపులను సిద్ధం చేస్తున్నారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి మంగళవారం ట్రాన్స్మిషన్ విభాగం క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. 15వ తేదీ నుంచి అత్యవసర పంపింగ్ ప్రారంభించి.. గోదావరి జలాలను తరలించనున్నారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కాళేశ్వరం నీటి రాకతో ఇక అత్యవసర తరలింపు అనేది లేకుండా సంవత్సరం పొడవునా రోజూ 172 మిలియన్ గ్యాలన్ల నీటి తరలింపు సజావుగా జరిగేది. వాస్తవంగా వర్షాభావ పరిస్థితులున్న సందర్భాల్లో కడెం నుంచి ఎల్లంపల్లిలోకి నీరు రావడం ఆలస్యమైన సందర్భాల్లో మాత్రమే జలమండలి అధికారుల్లో అందోళన నెలకొనేది. ఎల్లంపల్లి ఎఫ్ఆర్ఎల్ (ఫుల్ రిజర్వాయర్ లెవల్) 148 ఉండగా, 138.5 మినీమం డ్రా లెవల్కు రాగానే ఎల్లంపల్లి నుంచి అత్యవసర పంపింగ్ ద్వారా నీటిని నగరానికి తరలించాలనే ప్రతిపాదనను జలమండలి అధికారులు తీసుకొచ్చేవారు. ఎమర్జెన్సీ పంపింగ్ దాదాపుగా ఆరేడు కోట్ల రూపాయల నిధులు ఖర్చుతో కూడుతున్నది.
గోదావరి జలాల తరలింపు ప్రక్రియలో 2016లో ఒక్కసారి మాత్రమే ఎల్లంపల్లి నుంచి అత్యవసర పంపింగ్ ద్వారా నీటిని తరలించిన సందర్భాలున్నాయి. ఎల్లంపల్లి బ్యారేజీలో నీటి నిల్వ తగ్గిన కొద్దీ ఆ ప్రభావం నగరంపై పడేది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుతో గ్రేటర్లో గోదావరి నీటిపై ఆధారపడిన ప్రాంతాల తాగునీటికి శాశ్వత పరిష్కారం దొరికినైట్లెయింది. ఎల్లంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా పనిచేయడంతో ఏడాది పొడవునా నీటి తరలింపు సులువు కావడంతో దాదాపు 8 సంవత్సరాలు అటు ప్రజలతో పాటు జలమండలికి ఊరట లభించింది. కానీ కాంగ్రెస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు ఆశించిన స్థాయిలో వినియోగంలోకి లేకపోవడంతో ఎల్లంపల్లి రిజర్వాయర్ నీటి నిల్వలు ఆందోళనకరంగా మారాయి.
ఎల్లంపల్లిలో గరిష్ఠ స్థాయి నీటి మట్టం 485.560 అడుగులు కాగా, ప్రస్తుతం సోమవారం నాటికి 458.257 అడుగుల మేర ఉంది. జలమండలి అప్రమత్తమై అత్యవసర పంపింగ్ వైపు అడుగులు వేసింది. గోదావరి పరీవాహక ప్రాంతంలో ప్రస్తుతం ఆడపాదడపా వర్షాలు కురుస్తున్నా..ఆశించిన స్థాయిలో ఇన్ఫ్లో రావడం లేదని, వర్షాకాలం కావడంతో కొద్ది రోజులు మాత్రమే ఎత్తిపోతలు ఉండే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు నాగార్జున సాగర్లో అత్యవసర పంపింగ్ కొనసాగుతున్నది. నగరానికి అవసరమయ్యే 270 మిలియన్ గ్యాలన్ల నీటిని మూడు దశల్లో తరలిస్తున్నారు. సాగర్ పూర్తి నీటి మట్టం 590 అడుగులు కాగా ..504 అడుగుల మేర ఉంది. 500 అడుగుల వరకు ఎత్తిపోతల ద్వారా నగరానికి నీటిని అందించిన సందర్భాలు గతంలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.