సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం మూడో స్టాండింగ్ కమిటీ సమావేశం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ కమిటీ సమావేశంలో 8 అంశాలు, ఒక టేబుల్ ఐటమ్కు సభ్యులు ఆమోదం తెలిపారు. ఆమోదించిన ఎనిమిది అంశాల్లో ఎక్కువగా రోడ్లు, జంక్షన్ల అభివృద్ధికి సంబంధించి ఆమోదం తెలిపినట్లు చెప్పారు. 2020 గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్బాబు భార్య సంతోషికి బంజారాహిల్స్ రోడ్ నం. 14లో 711 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తూ.. స్టాండింగ్ కమిటీ తీర్మానించింది. ఈ సమావేశంలో కమిషనర్ ఆమ్రపాలి, స్టాండింగ్ కమిటీ సభ్యులు బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్, మహమ్మద్ ఖాదీర్, అర్చన, మహమ్మద్ నజీరుద్దీన్, గౌసుద్దీన్ మహమ్మద్, మన్నె కవితారెడ్డి, ఉప్పల పాటి శ్రీకాంత్, ఆవుల రవీందర్రెడ్డి, చింతల విజయశాంతి, కంది శైలజ, అధికారులు ఈఎన్సీ జియావుద్దీన్, ప్రాజెక్టు సీఈ దేవానంద్, సీఈ కోటేశ్వరరావు, అడిషనల్ కమిషనర్లు స్నేహ శబరీశ్, శివకుమార్ నాయుడు, నళినీ పద్మావతి, గీతా రాధిక, యాదగిరిరావు, సునందరాణి, సీసీపీ రాజేంద్రప్రసాద్ నాయక్, చీఫ్ ఎంటమాలజీ డాక్టర్ రాంబాబు, చీఫ్ వెటర్నరీ డాక్టర్ అబ్దుల్ వకీల్, శానిటేషన్, లేక్స్ ఇంజినీరింగ్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
స్టాండింగ్ కమిటీలోఆమోదించిన అంశాలివీ..
జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తులు, యుటిలిటిస్కు జీఐఎస్ సర్వే, మ్యాపింగ్ పనులకు రూ. 21.98 కోట్లతో నియో జియో ఇన్ఫో టెక్నాలజీస్ ప్రై.లి ఏజెన్సీకి కేటాయించగా, ఇందుకు కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ ఆమోదించింది. పైపులైన్ రోడ్ నుంచి కుత్బుల్లాపూర్ మెయిన్ రోడ్ వయా వెన్నెల గడ్డ చెరువు ప్రతిపాదిత 18 మీటర్లు, 9 మీటర్ల రోడ్డు వెడల్పు, పైపులైన్ రోడ్డు నుంచి గజానన్ ఎన్క్లేవ్ వరకు 18 మీటర్ల రోడ్డు వెడల్పునకు 105 ఆస్తుల సేకరణ, కిషన్బాగ్ జంక్షన్, ఇండియానా హోటల్ నుంచి రోడ్ నం. 9, చింతల్మెట్ మీదుగా పిల్లర్ నంబర్. 202 వరకు ప్రతిపాదిత 30 మీటర్ల రోడ్డు వెడల్పునకు 418 ఆస్తుల సేకరణ, బార్కాస్ డివిజన్ మసీద్-ఈ-నూర్ ఇస్మాయిల్ నగర్ నుంచి బిస్మిల్లా కిరాణా స్టోర్, బండ్లగూడ వరకు ప్రతిపాదిత 18 మీటర్ల రోడ్డు వెడల్పునకు ప్రభావితమయ్యే 153 ఆస్తులను మాస్టర్ప్లాన్లో చేర్చి ఆమోదం తెలిపి ప్రభుత్వానికి పంపేందుకు కమిటీ ఆమోదించింది. ఉప్పల్పల్లి పీవీఆర్ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 178 నుంచి సన్రైజ్ కాలనీ ధాని రెసిడెన్షీ, సన్రైజ్ వ్యాలీ వరకు ప్రతిపాదిత 12 మీటర్ల రోడ్డు వెడల్పునకు 67 ఆస్తుల సేకరణకు ఆమోదించారు. గోపన్పల్లిలో జంతు సంరక్షణ కేంద్రం నిర్మాణ పనులను మెస్సర్స్ రాంకీ ఫౌండేషన్ సీఎస్ఆర్ సొంత నిధులతో చేపట్టి ఎన్జీవో ఆల్ ఫర్ యానిమల్స్ ఫౌండేషన్ 25 సంవత్సరాల పాటు వైద్య సదుపాయాల లీజుకు ఇచ్చేందుకు కమిటీ ఆమోదించింది.
అభివృద్ధి పనులన్నీ పెండింగ్ స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో భాగంగా 11 అంశాలను ఎజెండాలో పెట్టి సుదీర్ఘంగా సభ్యులు చర్చించారు. రహదారుల విస్తరణ కోసం ఆస్తుల సేకరణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సమయంలో పలు చోట్ల జంక్షన్ అభివృద్ధి, ఇతర డెవలప్మెంట్ పనులకు సంబంధించి అంశాలను పెండింగ్లో పెట్టారు. మూసారాంబాగ్ బ్రిడ్జి పనుల్లో భాగంగా యుటిలిటిస్ షిప్టింగ్ పనులకు రూ. 3.97 కోట్లు, బేగంపేట ఆర్వోబీ మరమ్మతులు, పునరుద్ధరణకు రూ. 20కోట్లు, ఆర్కే పురం ఆర్వోబీ పునరుద్ధరణ పనులకు రూ. 6 కోట్లు, రహ్మత్నగర్ (పీజేఆర్ విగ్రహం) జంక్షన్ అభివృద్ధి పనులకు రూ. 5.17కోట్లు, యూసుఫ్గూడ జంక్షన్ అభివృద్ధి పనులకు రూ. 4.90 కోట్లు, ఐఎస్ సదన్ డివిజన్లో బాలాజీ నగర్ కాలనీ నుంచి బీఎస్ఎన్ఎల్ ఖాళీ స్థలం వరకు వరద నీటి కాలువ నిర్మాణానికి రూ.4 కోట్ల పనులు పెండింగ్లో పడ్డాయి. వీటితో పాటు మేడ్చల్-మల్కాజిగిరిలో డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవం సందర్భంగా చేసిన ఖర్చు చెల్లింపు పెండింగ్లో పెట్టారు. వీఎస్టీ స్టీల్ బ్రిడ్జికి రూ.139 కోట్ల అదనపు చెల్లింపును వాయిదా వేశారు.
ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛత సాధ్యం
నగరాన్ని వ్యర్థ రహిత, స్వచ్ఛ నగరంగా రూపొందించుకోవడంలో ప్రజలను భాగస్వాములను చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం మేయర్ అధ్యక్షతన శానిటేషన్పై అడ్హక్ కమిటీ సమావేశం జరిగింది. నగరంలో చెత్త సమస్య పరిష్కారంపై చేపట్టాల్సిన చర్యలపై కమిటీ సభ్యులతో చర్చించారు. ప్రతి కార్పొరేటర్ తమ పరిధిలో ప్రజల్లో మార్పు తెచ్చేలా వారికి అవగాహన కల్పించాలని మేయర్ సూచించారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా స్వచ్ఛ ఆటోల్లో వేసేలా చూడాలన్నారు. రాంకీ ఏజెన్సీ వాహనాలు తప్పనిసరిగా వ్యర్థాలు ఎత్తి వేసేలా సరైన పర్యవేక్షణ ఉండాలని, ఆ దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారికి సూచించారు. శానిటేషన్ను గాడిలో పెట్టేలా చర్యలు తీసుకోనున్నట్లు మేయర్ తెలిపారు.
ప్రజలకు అవగాహన కలిగేలా..
సీ అండ్ డీ వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించి ప్రజలకు అవగాహన కలిగేలా సంబంధిత ఏజెన్సీ వారి వివరాలు, ఫోన్ నంబర్లతో అన్ని ఏరియాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని మేయర్ సూచించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆయా సమస్యలపై చర్చించి పలు సలహాలు, సూచనలు చేశారు. ప్రజల్లో మార్పు తీసుకురావాలని, ప్రతి ఇంటికీ స్వచ్ఛ ఆటో వెళ్లి చెత్త సేకరణ చేయాలని, ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛ ఆటోలోనే చెత్త వేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ అన్నారు. చెత్త తొలగించడంలో కొత్త టెక్నాలజీని వాడుకోవాలని సూచించారు. ఆదే విధంగా చెత్త వేయడానికి మొబైల్ బిన్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఆనంతరం కార్పొరేటర్ సయ్యద్ సోహెల్ ఖాద్రీ మాట్లాడుతూ ఎక్కడా చెత్త సరిగ్గా తీయడం లేదని, గార్బేజ్ ఓవర్ ఫ్లో అవుతున్నదని, గార్బేజ్ పాయింట్స్ తొలగించాలని.. చెత్త సేకరణ క్రమం తప్పకుండా చేయాలని కోరారు. శాశ్వతంగా బిన్లను ఏర్పాటు చేస్తే బాగుంటుందని కార్పొరేటర్ డాక్టర్ సురేఖ అభిప్రాయపడ్డారు. చెత్త ఎత్తడంలో రాంకీ సంస్థ పూర్తిగా విఫలమైందని, పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని కార్పొరేటర్ డాక్టర్ ఆయేషా హుమేరా తెలిపారు. ఈ సమావేశంలో అడ్హక్ కమిటీ సభ్యులు మధుసూదన్, మినాజ్, అదనపు కమిషనర్ రవికిరణ్, సీ అండ్ డీ వేస్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రతినిధి రఘు, రాంకీ ఏజెన్సీ ప్రతినిధులు ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.