సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా సోమవారం మధ్యాహ్నం కురిసిన వాన గ్రేటర్ జనజీవనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. దాదాపు గంట పాటు కుమ్మరించిన వర్షంతో కొన్ని చోట్ల ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. మ్యాన్హోళ్లు, నాలాలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ముఖ్యంగా వరుణుడి ‘దెబ్బకు షేక్పేట షేక్ అయింది. 5.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. షేక్పేటలో గల్లీ నుంచి ప్రధాన రహదారులపై వరద నీరు ముంచెత్తింది. కార్లు, బైకులు కొట్టుకుపోయాయి..షేక్పేట వైపు ప్రయాణం అంటేనే జడిసిపోయేలా చేసింది. రాత్రి వరకు షేక్పేట వరద ప్రభావం నుంచి కోలుకోలేదు. ఒక్క షేక్పేటే కాదు..శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, బాలానగర్ పరిసర ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. ఈ క్రమంలోనే చిన్నపాటి వర్షానికే నెమ్మదించే నగర ట్రాఫిక్ భారీ వర్షానికి స్తంభించిపోయింది.
మరోవైపు నగరంలో అనేక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కాగా… కొన్నిచోట్ల చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి. అదృష్టవశాత్తు గ్రేటర్ వ్యాప్తంగా ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. మొత్తంగా ట్రాఫిక్ పోలీసులు, సహాయక చర్యల ఆలస్యంతో నగరంలో ట్రాఫిక్లో ఇరుక్కుపోయి వాహనదారులు ప్రత్యక్ష నరకాన్ని చూశారు. పలు ప్రాంతాల్లో వరద నీరు నిలిచింది.