సిటీబ్యూరో, జూన్ 28 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో నాలా పూడికతీత పనుల్లో జీహెచ్ఎంసీ అలసత్వం ప్రదర్శిస్తోంది. గత నెల 31వ తేదీ నాటికే నిర్దేశిత గడువు పూర్తి చేసుకొని వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పనులపై నిర్లక్ష్యం చూపారు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు కావొస్తున్నా.. నేటికీ నాలాల పూడికతీత పనులు కొనసాగుతుండటం అధికారుల పనితీరుకు అద్దంపడుతోంది.నిర్దేశిత లక్ష్యంలోపు పూర్తి చేయకపోవడం, ప్రస్తుతం 81 శాతం మాత్రమే పూర్తి చేయడం, పైగా నెలాఖరు వస్తుండటంతో హడావుడిగా నాలాల పూడికతీత పనులు జరుగుతున్నాయి. పర్యవేక్షించే వారు లేకపోవడంతో అడుగు భాగంలో పేరుకుపోయిన మట్టి, ఇతర వ్యర్థాలు ముట్టుకోవడం లేదు. పైన ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తా చెదారాన్ని తీసేస్తున్నారు. తీసేసిన కొద్ది పాటి పూడికనూ రోడ్డుపైనే వదిలేస్తున్నారు. అయితే పూడికతీత పనులపై ఇంజినీర్ల పర్యవేక్షణ కొరవడంతో కొందరు కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారని కార్పొరేటర్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. పూడికతీత పనులు పారదర్శకంగా జరగడం లేదన్న ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. మొత్తంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేమితో పూడికతీత పనులు పారదర్శకంగా జరగడం లేదు. నాలా పరీవాహక ప్రాంత ప్రజలు భారీ వర్షం వస్తే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవించాల్సిన పరిస్థితి నెలకొన్నదని పలువురు వాపోతున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో వరద నీటి కాలువల పొడవు 1302 కిలోమీటర్ల మేర ఉండగా…390 కిలోమీటర్లు మేజర్ నాలా, మైనర్ డ్రైయిన్స్ 912 కిలోమీటర్లు మేర ఉన్నాయి. ప్రతి ఏటా మాదిరిగానే వరద నీరు సాఫీగా దిగువకు వెళ్లేందుకు పునరుద్ధరణ, మరమ్మతు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. పనులను సకాలంలో చేయకుండా వరద నీటి ముంపునకు అధికారులు కారణమవుతున్నారు. గతేడాది 63 చోట్లకు గానూ రూ. 53.60కోట్ల అంచనాతో 945 కిలోమీటర్ల మేర పూడికతీత పనులను చేపట్టి..3.04 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీత వెలికితీశారు. ఇందు కోసం రూ. 36.58కోట్లు ఖర్చు చేశారు. ఇదే ఏడాది 201 చోట్ల పనులకు రూ. 56.38 కోట్ల అంచనాతో 919 కిలోమీటర్ల మేర పూడికతీత పనులు చేపట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం 3.12 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. వర్షాలు పడుతున్నా..81 శాతం పనులు మాత్రమే పూర్తి చేయడం అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నది.