ముషీరాబాద్ : పర్యావరణ పరిరక్షణను ప్రతి పౌరుడు బాధ్యతగా భావిస్తూ విధిగా మొక్కలు నాటాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ (MLA Mutha Gopal ) సూచించారు. గురువారం హరితహారం (Harithaharam) కార్యక్రమంలో భాగంగా అడిక్మెట్ డివిజన్ అచ్చుతారెడ్డి మార్గ్లో బీఆర్ఎస్(BRS) నాయకులతో కలిసి మొక్కలు నాటారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణ హితం కోసం మొక్కలు నాటే కార్యక్రమాలను ఏటా ప్రభుత్వం చేపట్టడంతోపాటు పార్టీలు, సంఘాలు తమవంతు బాధ్యగా నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో, అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు(KCR) నేతృత్వంలో హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టి చక్కటి ఫలితాలను సాధించారని తెలిపారు.
తెలంగాణ ప్రాంతాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చారని గుర్తు చేశారు. అంతకు ముందు కవాడిగూడ డివిజన్ మోతిలాల్ నెహ్రూనగర్ బస్తీలో చేపట్టనున్న డ్రైనేజీ పైపులైన్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్ రచనశ్రీతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ అడిక్మెట్ డివిజన్ ప్రధాన కార్యదర్శి కె.సురేందర్, బీఆర్ఎస్ యూత్ విభాగం నేత ముఠా జయసింహ, రామాలయం చైర్మన్ డి.రవియాదవ్, ఖలీల్, అనురాధ, ధర్మ, ప్రవీణ్, నాగులు, హరీష్, ప్రియాంక, మాధవి పాల్గొన్నారు.