Godavari Water | సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : ఎత్తిపోతల ద్వారా నగరానికి గోదావరి జలాల తరలింపు ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభం కానున్నది. బుధవారం నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి అత్యవసర పంపింగ్తో నగరానికి రోజూ 168 ఎంజీడీలను తరలించనున్నారు. ఈ మేరకు ఏడు పంపులను అధికారులు సిద్ధం చేసి ట్రయల్ రన్ పూర్తి చేశారు. సోమవారం రోజు అన్ని పంపులను ఆన్చేసి సాధ్యసాధ్యాలను పరిశీలించిన అధికారులు.. బుధవారం నుంచి పూర్తి స్థాయిలో ఎమర్జెన్సీ పంపింగ్కు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. గోదావరి జలాల తరలింపులో భాగంగా ఎల్లంపల్లి రిజర్వాయర్ నీటి నిల్వలు వేగంగా అడుగంటుతున్నాయి.
వర్షాకాలం ప్రారంభమైనా.. కడెం ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లిలోకి వరద నీరు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం ఎల్లంపల్లిలో నీటి నిల్వలు 4.5 టీఎంసీల మేర ఉండగా.. ముందస్తుగానే అప్రమత్తమైన జలమండలి అధికారులు.. ఎల్లంపల్లి రిజర్వాయర్ బ్యాక్ చానల్ ముర్ముర్ ఫోర్సోర్ వద్ద అత్యవసర పంపింగ్ మోటర్లను ఏర్పాట్లు చేశారు. ఒక్కో పంపు నుంచి 25 క్యూసెక్కుల మేర తొలుత ఎత్తిపోసి.. గోదావరి జలాలను అందించి తాగునీటి కొరత లేకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. నీటి నిల్వలు తగ్గిన కొద్దీ మరిన్ని పంపులను ఏర్పాటు చేసే అవకాశమున్నదని, అయితే ఎల్లంపల్లిలోకి వరద కొద్ది రోజుల్లోనే ప్రారంభమవుతుందన్న ఆశాభావంలో అధికారులు ఉన్నారు. మొత్తంగా గోదావరి జలాల తరలింపు ప్రక్రియలో 2016లో ఒక్కసారి మాత్రమే ఎల్లంపల్లి నుంచి అత్యవసర పంపింగ్ ద్వారా నీటిని తరలించిన సందర్భాలు ఉన్నాయి.