సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ): నగరంలో విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులతో పాటు 8 మంది వినియోగదారులను టీజీ న్యాబ్ పోలీసులు అరెస్టు చేశారు. అంతే కాకుండా షాద్నగర్లోని ఓ కళాశాలకు చెందిన 20 మంది విద్యార్థులు మాదకద్రవ్యాలను వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బుధవారం నార్త్జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వివరాలు వెల్లడించారు. లంగర్హౌజ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అక్రమ్, కార్ఖానకు చెందిన సీఎస్. ప్రణయ్, వెస్ట్మారేడ్పల్లికి చెందిన రోహన్ విలియమ్ ముఠాగా ఏర్పడి విద్యార్థులే లక్ష్యంగా నగరంలోని పలు విద్యాసంస్థల్లో డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్నారు. స్నాప్చాట్ ద్వారా విద్యార్థుల నుంచి ఆర్డర్లు తీసుకుని, అవసరమున్న వారికి వారు కోరుకున్న డ్రగ్స్ విక్రయిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రాము ఓజీ వీడ్ రూ.4000, ఒక ఎల్ఎస్డీ బ్లాట్ రూ.3000 చొప్పున విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న టీజీ న్యాబ్ పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి పలు విద్యాసంస్థల వద్ద నిఘా పెట్టారు.
డ్రగ్స్ సరఫరా చేస్తున్న మహ్మద్ అక్రమ్, ప్రణయ్, రోహన్లను టీజీ న్యాబ్ పోలీసులు కార్ఖానా పోలీసులతో కలిసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. డ్రగ్స్ వినియోగిస్తున్న మలక్పేటకు చెందిన సాయి పృథ్వీనాథ్రెడ్డి(26), రాయదుర్గానికి చెందిన సాయిచరణ్రెడ్డి(29), జూబ్లీహిల్స్కు చెందిన సూర్యతేజ, జూబ్లీహిల్స్కు చెందిన నిఖిల్రెడ్డి(29), బంజారాహిల్స్కు చెందిన విద్యార్థి అర్జున్ చౌదరి(19), జూబ్లీహిల్స్కు చెందిన విద్యార్థి ఆదిత్యనారాయణరెడ్డి(20), సికింద్రాబాద్ పద్మారావునగర్కు చెందిన రోషణ్సింగ్(28)తో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారించగా, షాద్నగర్లోని ఓ కాలేజీకి చెందిన 20 మంది విద్యార్థులు పేర్లు బయటకు వచ్చాయి. దీంతో పోలీసులు సదరు విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి..డ్రగ్స్కు బానిసైన పిల్లలను డీ-అడిక్షన్ సెంటర్లో చేర్పిస్తున్నట్లు తెలిపారు.