సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ): ఒకే చోట పాతుకుపోయిన ఉద్యోగులను ఇతర చోట్లకు బదిలీలు చేయాలని జలమండలి నిర్ణయించింది. ఈ మేరకు పది సంవత్సరాల నుంచి ఒకే చోట పనిచేస్తున్న జీపీఈ (జనరల్ పర్పస్ ఎంప్లాయి) ఎస్పీఈ (స్పెషల్ పర్పస్ ఎంప్లాయి)లను తొలుత బదిలీ చేయాలని డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్కుమార్ ఆయా డివిజన్ల జీఎంలకు ఆదేశాలు జారీ చేశారు. ఒకే చోట పదేళ్లుగా కొనసాగుతున్న లైన్మన్లను కచ్చితంగా మార్చాలని, ఈ బాధ్యత జీఎంలదే అని ఆదేశించారు. కాగా ఈ బదిలీలపై వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్(బీఆర్టీయూ) నిరసన వ్యక్తం చేసింది.
అవినీతి అధికారులను వదిలేసి చిన్న ఉద్యోగులపై ప్రతాపం చూపడం తగదని బీఆర్టీయూ అధ్యక్షుడు జి. రాంబాబు యాదవ్ పేర్కొన్నారు. జలమండలిలో పాలన అస్తవ్యస్థంగా తయారైందని, జీఎం, డీజీఎంలను బదిలీలు చేసిన తర్వాతనే కింది స్థాయి ఉద్యోగులను బదిలీ చేయాలని రాంబాబు యాదవ్ స్పష్టం చేశారు. ఐదేళ్లకు పైబడిన డీజీఎం, మేనేజర్లను బదిలీ చేయాలని గత నెల 19న సర్క్యులర్ జారీ చేసి ఇప్పటి వరకు బదిలీలు చేయడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. డీజీఎంలు 25 నుంచి 30 మంది, మేనేజర్ 50 నుంచి 70 మంది వరకు ఉంటారని, వీరిని బదిలీ చేయడం లేదని యూనియన్ సభ్యులు మండిపడుతున్నారు.