మణికొండ, ఆగస్టు 20: చిత్రపురికాలనీలో అనుమతులకు మించి నిర్మిస్తున్న ఏడు విల్లాలను మణికొండ మున్సిపాలిటీ అధికారులు మంగళవారం కూల్చివేసేందుకు శ్రీకారం చుట్టారు. దీంతో గత కొన్ని రోజులుగా చిత్రపురికాలనీలో చోటు చేసుకుంటున్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.
గుట్టుచప్పుడు కాకుండా నిర్మిస్తున్న అక్రమ విల్లాలపై స్థానికులు కొంతమంది టౌన్ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన మున్సిపాలిటీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా విల్లాలను నిర్మిస్తున్నట్లు గుర్తించారు. చిత్రపురికాలనీలో 220 విల్లాల నిర్మాణం కోసం అనుమతులు పొందిన ఆ సొసైటీ సభ్యులు.. అందుకు భిన్నంగా ఏడు విల్లాలను అక్రమంగా నిర్మిస్తున్నారు. ఇవన్నీ మాస్టర్ప్లాన్ రోడ్డులోనే నిర్మించినట్లు అధికారులు తెలిపారు.
నిబంధనలను అతిక్రమించడంతో పాటు రోడ్డులో విల్లాలను నిర్మించడం సరికాదని, టౌన్ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీ చేసినా సదరు నిర్మాణదారులు స్పందించకపోవడంతో మంగళవారం టీపీవో సంతోష్సింగ్ నేతృత్వంలో కూల్చివేతలను చేపట్టారు. మొదటిరోజు రెండు విల్లాలను కూల్చివేశామన్నారు. నిబంధనలను ఉల్లంఘించినవారు ఎవరైనా సరే చర్యలు తప్పవని టౌన్ప్లానింగ్ అధికారి సంతోశ్ సింగ్ తెలిపారు.