దుండిగల్, జూలై 3: భవననిర్మాణ సంస్థ నిర్లక్ష్యం ఓ నిండుప్రాణాన్ని బలి తీసుకున్నది. కార్మికుల ప్రాణాల రక్షణకు ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టకుండానే నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. దీంతో ఓ కూలీ జీవితం గాల్లో కలిసింది. వైరు తెగడంతో మెటీరియల్ లిఫ్టింగ్ మిషన్ కూలీపై పడి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచిన ఈ ఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో బుదవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా, రాయికోడ్ మండలం, హస్నాబాద్కు చెందిన రాములు(56), రుక్కమ్మ దంపతులు. వీరికి ముగ్గురు కొడుకులు ఉన్నారు. కొన్నేండ్ల కిందట కుటుంబసభ్యులతో కలిసి రాములు బతుకుదెరువు కోసం వలసవచ్చి శేరిలింగంపల్లిలోని అశోక్నగర్లో నివాసముంటున్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. రాములు తన పెద్ద కొడుకుతో కలిసి గత రెండేండ్లుగా బాచుపల్లిలోని కౌసల్యకాలనీలో డాల్ఫిన్స్ డెవలపర్స్ నిర్మిస్తున్న అపార్ట్మెంట్స్లో నిర్మాణ కూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం సదరు నిర్మాణ సంస్థకు చెందిన బ్లాక్ బీ- అపార్ట్మెంట్ 6వ అంతస్తులో బ్రిక్స్ పనులు నడుస్తుండగా.. కింద ఉన్న రాములు మెటీరియల్ లిఫ్టింగ్ మిషన్లో సిమెంట్ ఇటుకలు వేసి మిషన్ ద్వారా పైకి పంపిస్తుండగా వైర్ తెగిపోయింది. దీంతో కింద ఉన్న రాములు తలపై మిషన్తో పాటు ఇటుకలు పడటంతో తల పగిలి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అయితే, రాములు కొన ఊపిరితో ఉన్నట్లు భావించిన తోటి కార్మికులు వెంటనే సమీపంలోని ఎస్ఎల్జీ వైద్యశాలకు తరలించారు. భవన నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంతోనే రాములు మరణించాడని, తగిన పరిహారం చెల్లించేంత వరకు మృతదేహాన్ని కదలనీయమంటూ మృతుడి కుటుంబసభ్యులు పట్టుబట్టారు. చివరకు ఇరువర్గాల మధ్య సయోధ్య కుదరడంతో మృతదేహం తరలింపునకు అంగీకరించారు.
బాచుపల్లి సర్వేనంబర్ 309 పార్టులోని 7889.79 స్క్వేర్ మీటర్ల విస్తీర్ణంలో బహుళ అంతస్తుల భవనాలను (రెసిడెన్షియల్) నిర్మించేందుకు జి. బాబురావు అండ్ అదర్స్ పేరిట 2020లో హెచ్ఏండీఏ నుంచి డాల్ఫిన్ డెవలపర్స్ అనుమతులు తీసుకున్నారు. ఇందులో ఏ బ్లాక్లో జీ+4 అంతస్తులకు, బీ- బ్లాక్లో జీ+5అంతస్తులకు అనుమతులు పొందారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ సెట్బ్యాక్ల విషయంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా.. నిర్మాణ సమయంలో కార్మికుల ప్రాణాల భద్రతకు ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టకుండానే పనులు చేయిస్తున్నట్లు బుధవారం జరిగిన ఘటనతో తేటతెల్లమైంది. తోటి కార్మికులు సైతం నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం కారణంగానే రాములు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని పేర్కొనడం గమనార్హం. కనీసం కార్మికుల తలకు సేఫ్టీ హెల్మెట్ కూడా ఇవ్వలేదని పేర్కొంటున్నారు. అయితే, సదరు నిర్మాణ సంస్థ కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడిదని తెలుస్తుంది.