మేడ్చల్, జూలై 1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ గూండాగిరికి భయపడేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా తూంకుంట మున్సిపల్ కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు మున్సిపల్ వైస్ చైర్స్పర్సన్ వాణీ వీరారెడ్డిపై దాడి చేశారు. ఈ క్రమంలో సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ వాణీ వీరారెడ్డిని ఫోన్లో పరామర్శించారు.
కాంగ్రెస్ శ్రేణులు చేస్తున్న దాడులను ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చిన బీఆర్ఎస్ పార్టీకి ఇలాంటి దాడులు కొత్త కాదన్నారు. బీఆర్ఎస్ కార్యకర్యలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాము అండగా ఉంటామన్నారు. కాంగ్రెస్ గూండాగిరిపై చట్టరీత్యా చర్యలు తీసుకునే వరకు పోరాడుతామన్నారు. కాగా, కాంగ్రెస్ దాడిలో గాయపడ్డ వాణీ వీరారెడ్డిని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించారు.
దాడి ఘటనపై వివరాలను ఆమె భర్త వీరారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతున్న సమయంలో ఇతర వ్యక్తులకు ఎలా అనుమతి ఇచ్చారని మున్సిపల్ కమిషనర్, సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట చైర్మన్ రాజేశ్వర్రావు, కౌన్సిలర్లు సురేశ్, నర్సింగ్గౌడ్, హరిబాబు, శ్రీధర్రెడ్డి, భరత్ తదితరులు ఉన్నారు.