CM Revanth Reddy | హైదరాబాద్, జూలై 1(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పరిధిలోని విపత్తుల నిర్వహణ విభాగాన్ని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సచివాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఎండీఏ, మూసీ డెవలప్మెంట్ అధికారులతో సీఎం సోమవారం సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ, దాని చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీల వరకు ఈ విభాగం సేవలు అందించేందుకు అవసరమైన వ్యవస్థాగత మార్పులు చేయాలని సూచించారు. ఇకపై ఈ విభాగాన్ని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) అని పేరు పెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
కేవలం వరదలు, ప్రమాదాలు సంభవించినప్పుడే కాకుండా ఇకపై విపత్తుల నిర్వహణ విభాగం సిటీ ప్రజలకు నిరంతరం సేవలందించేలా పునర్ వ్యవస్థీకరణ జరగాలన్నారు. నగరంలో ప్రజలు ఎదురునే సమస్యలన్నింటిలో హైడ్రా క్రియాశీలకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. డీఐజీ స్థాయి అధికారి ఈ విభాగానికి డైరెక్టర్గా, ఎస్పీ స్థాయి అధికారులు అడిషనల్ డైరైక్టర్లుగా ఉండేలా చూడాలని సీఎం సూచించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డు, సిటీ ట్రాఫిక్, వివిధ విభాగాల నుంచి ప్రత్యేక టీమ్లు ఈ విభాగంలో నియమించాలని సూచించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలను పరిరక్షించటం, సిటీలోని నాలాలు, ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణలకు గురవకుండా కాపాడే కీలక బాధ్యతలను ఈ విభాగమే చేపట్టాలని నిర్ణయించారు. దీంతో పాటు హోర్డింగులు, ఫ్లెక్సీల నియంత్రణ, తాగునీటి పైపులైన్లు, విద్యుత్తు సరఫరా లైన్లు, డ్రైనేజీలు, వరద నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ వ్యవహారాలన్నింటిలోనూ ఈ విభాగం సేవలను అందిస్తుంది. అందుకు వీలుగా ఈ విభాగం పునర్ వ్యవస్థీకరణ, సిబ్బంది, విధులు, నిధుల కేటాయింపు, బాధ్యతలపై ముసాయిదా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు.
దీంతో పాటు మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. సిటీలోని చారిత్రక ప్రాధాన్యమున్న కట్టడాలు, శిథిలమైన నిర్మాణాలను పునరుద్ధరించేందుకు, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, జీహెచ్ఎంసీ విజిలెన్స్ విపత్తు నిర్వహణ కమిషనర్ ఏవీ రంగనాథ్, హైదరాబాద్ వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి పాల్గొన్నారు.