Swatch Hyderabad | సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో పారిశుధ్య నిర్వహణ గాడి తప్పుతోంది..స్వచ్ఛ సర్వేక్షణ్-2024లో హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలుపుతామన్న లక్ష్యం నీరుగారుతోంది. గడిచిన కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా.. రహదారుల వెంట పేరుకుపోయిన చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి..తరచూ చెత్త వేసే ప్రాంతాలు (గార్భేజీ వనరేబుల్ పాయింట్లు/జీవీపీ) జీహెచ్ఎంసీ పరిధిలో 2640 ప్రాంతాలను గుర్తించి వాటిని పూర్తి స్థాయిలో ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. కానీ.. క్షేత్రస్థాయిలో వీటికి అదనంగా కొత్తగా జీవీపీ పాయింట్లు పుట్టుకొస్తున్నాయి. స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటి చెత్త సేకరణ సరిగా జరగడం లేదు. ఈ నేపథ్యంలోనే పారిశుధ్యంపై ఫిర్యాదులు అధికం కావడం, ఇటీవల జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్వయంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పారిశుధ్య నిర్వహణ ఏ మాత్రం బాగులేదని, తన డివిజన్లో చెత్త ఎత్తడం లేదని సంబంధిత జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గత సోమవారం ఐఏఎస్ల బదిలీల సందర్భంలో పారిశుధ్య విభాగం అదనపు కమిషనర్ (నాన్ క్యాడర్) ఉపేందర్రెడ్డిని ప్రభుత్వం శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్గా బదిలీ చేసింది. నాలుగు రోజులు గడిచినప్పటికీ కీలకమైన ఈ స్థానాన్ని ఎవరికీ అప్పగించలేదు. ఇదిలా ఉంటే గడిచిన నాలుగు రోజులుగా పారిశుధ్య విభాగానికి బాధ్యతలు స్వీకరించేందుకు అదనపు కమిషనర్లు ముందుకు రావడం లేదు. శానిటేషన్ విభాగం బాధ్యతలు మాకొద్దు బాబోయ్ అంటూ దూరంగా ఉంటున్నారు. కేంద్ర కార్యాలయంలో ఉన్న ఉన్నతాధికారులు సైతం పారిశుధ్యం విభాగం మాకొద్దు అంటున్నారు.
కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహాన్ 10 రోజుల పాటు వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్లడం, ఈ స్థానంలో ఇన్చార్జి జోనల్ కమిషనర్గా పంకజకు అప్పగించారు. కానీ పారిశుధ్య విభాగానికి మాత్రం అదనపు కమిషనర్ను నియమించలేదు. ఈ స్థానాన్ని సమర్థవంతమైన అధికారితో భర్తీ చేయడం, పారిశుధ్య నిర్వహణను మళ్లీ గాడిలో పెట్టడం కొత్త కమిషనర్ ఆమ్రపాలికి సవాల్గా మారింది. ఇటీవల కొత్తగా వచ్చిన జోనల్ కమిషనర్లు సైతం క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లకపోవడంతో చాలా ప్రాంతాల్లో చెత్త నగరంగా హైదరాబాద్ దర్శనమిస్తున్నది. అసలే వర్షాకాలం, ఆపై దోమల విజృంభణ, డెంగీ వ్యాధులు వెరసి ప్రజల ప్రాణాలతో జీహెచ్ఎంసీ చెలగాటం ఆడుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సైతం క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయక.. లోపాలను సరిదిద్దలేక పారిశుధ్య విభాగాన్ని గాలికి వదిలేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
గేటర్లో చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా దాదాపు మూడున్నరేండ్ల కిందట డస్ట్ బిన్ లెస్ సిటీ పేరుతో చెత్త కుండీలను జీహెచ్ఎంసీ ఎత్తేసింది. వందకు వంద శాతం ఇంటింటి చెత్త సేకరణకు స్వచ్ఛ ఆటోల సంఖ్యను పెంచారు. సుమారు 5250 స్వచ్ఛ ఆటోల ద్వారా నగరంలో 4886 కాలనీల్లో 23 లక్షల గృహాల నుంచి రోజుకు 7వేల మెట్రిక్ టన్నులకు పైగా చెత్త సేకరణ జరగాలి. ఒకొక అటో కు సుమారుగా 500 నుంచి 600 ఇండ్లను కేటాయించి, చెత్త సేకరణ జరపాలి. కానీ గడిచిన కొన్ని రోజులుగా స్వచ్ఛ ఆటోల పనితీరు సరిగా ఉండడం లేదు. చాలా కాలనీలకు రోజూ స్వచ్ఛ ఆటోలు రావడం లేదు. రోజూ 1000 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదని స్వయంగా గత కమిషనర్ రోనాల్డ్ రాస్ గుర్తించారు. నేటికీ స్వచ్ఛ ఆటోల పనితీరుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించింది. దీంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతున్నది.
స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలుపడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం చర్యలు చేపట్టి మెరుగైన ర్యాంకులను సాధించింది. స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా తడి, పొడి చెత్త వేర్వేరు , ఇంటింటి నుంచి చెత్త సేకరణ కాలనీ, బస్తీ సంక్షేమ సంఘాల భాగస్వామ్యం, ఓడీఎఫ్కు చర్యలు, బహిరంగ మలమూత్ర విసర్జన నివారణ చర్యలు, స్వచ్ఛతపై చైతన్య కార్యక్రమాలు, 50 మైక్రాన్ల కన్నా తక్కువ నిడివి ఉన్న ప్లాస్టిక్ నిషేధం వంటి కార్యక్రమాలు పక్కాగా చేపట్టింది. ప్రధానంగా చెత్త కుండీలు లేని నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దే క్రమంలో దాదాపు 22 లక్షల గృహాలకు ఒక్కో ఇంటికి తడి, పొడి చెత్త సేకరణకు 44 లక్షల చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఇంటింటికీ చెత్త సేకరణకు 4500 స్వచ్ఛ ఆటో టిప్పర్లను వినియోగించారు. ట్రాన్స్ఫర్ స్టేషన్లు, ఆధునిక వాహనాల వినియోగంతో వెరసి జీహెచ్ఎంసీకి ‘ బెస్ట్ సెల్ఫ్ సైస్టెనబులిటీ అవార్డుతో పాటు, 3 స్టార్ రేటింగ్ సిటీగా నగరం నిలిచింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెత్త నిర్వహణ పూర్తి గాడి తప్పింది. పైగా పారిశుధ్య నిర్వహణ బాధ్యతలు స్వీకరించేందుకు ఏ ఒక్క అధికారి ముందుకు రాకపోవడం.. ఇప్పటి వరకు కీలక పోస్టును భర్తీ చేయకుండా ఉండటం జీహెచ్ఎంసీ పనితీరుకు అద్దంపడుతోంది.