Hyderabad | బండ్లగూడ,జూన్ 30 : వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మేయర్తో కలిసి ఫొటోదిగే విషయమై కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వివాదం చోటుచేసుకుని పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఇదంతా ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ ఉండగానే జరగడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే.. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆదివారం వన మహోత్స కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. దీనిని మేయర్ లతా ప్రేమ్గౌడ్తో కలిసి ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేతో కలిసి మేయర్, అధికారులు మొక్కలు నాటుతూ ఫొటో దిగుతున్నారు. అయితే.. బీఆర్ఎస్ నేత మల్లేశ్.. మేయర్కు అడ్డుగా నిలబడి ఫొటో దిగుతుండగా అడ్డుగా ఉండవద్దని అక్కడి కాంగ్రెస్ నాయకులు సూచించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకుడు హరీశ్గౌడ్కు, కాంగ్రెస్కు చెందిన కార్పొరేటర్లు చంద్రశేఖర్,శ్రీనాథ్రెడ్డిల మధ్య గొడవ జరిగి.. పరస్పరం దాడులకు పాల్పడ్డారు. అనంతరం ఇరువురు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే.. ఆ గొడవ అంతా ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ ఉండగానే జరిగింది.
ఫిర్యాదు అనంతరం బీఆర్ఎస్ నేత హరీశ్గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను స్థానికంగా చేస్తున్న సేవలను చూసి కాంగ్రెస్ నేతలు ఓర్వలేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారన్నారు. పోలీసుల సాక్షిగా తనను ఇష్టానుసారంగా బెదిరించారని ఆరోపించారు. వారినుంచి తనకు ప్రాణహాని ఉందని, పోలీసులు తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే.. తమపై అకారణంగా దాడులు చేశారని కార్పొరేటర్లు చంద్రశేఖర్, శ్రీనాథ్రెడ్డిలు తెలిపారు.