సిటీబ్యూరో: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన పాలనలో సీఎంగా చేసిన కృషి ఫలించింది. అప్పటి మంత్రి కేటీఆర్ కేంద్రంపై తెచ్చిన ఒత్తిడి మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు జీహెచ్ఎంసీలో విలీనం కానున్నది. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ బోర్డు ఈనెల 25న జరిగిన బోర్డు మీటింగ్లో తుది నిర్ణయం తీసుకున్నారు. బోర్డు పరిధిలోని సివిల్ ఏరియాలో ఉన్న మౌలిక వసతులు, ఆస్తులను జీహెచ్ఎంసీకి బదిలీ చేయనున్నారు. ఉచితంగానే ఈ ప్రక్రియ పూర్తికానున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరిపి చర్యలు తీసుకోవాలని రక్షణ శాఖ బోర్డు అధికారులను ఆదేశించింది. బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటివరకు కొనసాగుతున్న కంటోన్మెంట్ బోర్డులన్నింటినీ రద్దుచేసి మున్సిపాలిటీల్లో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి కేంద్ర రక్షణ శాఖకు లేఖ రాశారు.
ఈనెల 25న కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లోనూ విలీన ప్రక్రియ వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కేంద్ర రక్షణ శాఖ అందుకు సంబంధించిన విధి విధానాలపై లేఖ రాసింది. దీని ప్రకారం కంటోన్మెంట్లోని సివిల్ ఏరియాలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తారు. అక్కడి సౌకర్యాలు, మౌలిక వపతులు అన్నీ ఉచితంగా జీహెచ్ఎంసీకి బదిలీ చేస్తారు. కంటోన్మెంట్ బోర్డుల ఆస్తులు, అప్పులన్నీ మున్సిపాలిటీకి బదిలీ అవుతాయి. మిలటరీ స్టేషన్ మినహా కంటోన్మెంట్లోని నివాస ప్రాంతాలకు జీహెచ్ఎంసీ పరిధి విస్తరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పేరిట హక్కుగా ఉన్న భూములు, ఆస్తులు కేంద్రానికి దక్కుతాయి. ఈ ప్రాంతాలను విభజించేటప్పుడు సాయుధ దళాల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని కేంద్రం స్పష్టం చేసింది.