Cantonment | సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ ) : కంటోన్మెంట్ వాసుల చిరకాల ఆకాంక్ష నెరవేరింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పోరాటం ఎట్టకేలకు ఫలించింది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సివిలియన్ ప్రాంతాలను బల్దియాలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియ వేగవంతం కావడంతో కంటోన్మెంట్ వాసులకు మంచిరోజులు వచ్చినట్లే. ఎన్నో ఏండ్లుగా నగరం నడిబొడ్డున ఉన్నా.. ఆంక్షల నేపథ్యంలోనే జీవితాలు కొనసాగాయి. ఇండ్లు నిర్మించుకోవాలన్నా, పలు మార్గాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక కంటోన్మెంట్ విలీనం అయితే సమస్యలన్నింటికీ పరిష్కారం దొరికినట్లే.
ఫలించిన కేటీఆర్ పోరాటం: ఇప్పటివరకు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న అన్ని రకాల ఆస్తులను బల్దియాకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. అదేవిధంగా ఉన్న అప్పులను కూడా తీర్చే బాధ్యత బల్దియానే తీసుకోనున్నది. కాగా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని చాలా కాలంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. అప్పటి మంత్రి కేటీఆర్ ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో అవిశ్రాంతంగా పోరాటం చేస్తూ వచ్చారు. ఇంత కాలానికి ఆయన పోరాటం ఫలించింది.
అభివృద్ధి పనులకు: రోడ్ల విస్తరణ,ఫ్లై ఓవర్ల నిర్మాణం, జాతీయ రహదారి రూపకల్పన తదితర అభివృద్ధి పనులకు కంటోన్మెంట్ పరిధిలోని భూములు కీలకంగా ఉన్నాయని, ఇవన్నీ రక్షణ శాఖ పరిధిలో ఉన్నందున అనుమతులు రాకపోవడంతో అభివృద్ధి ప్రతిపాదనలకు ఇబ్బందికరంగా మారిందంటూ.. రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేంద్ర ప్రభుత్వానికి రాతపూర్వకంగానే విజ్ఞప్తి చేసింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక మంత్రి కేటీఆర్ అనేకసార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఈ భూములను బల్దియాకు అప్పగించాలని, ప్రత్యామ్నాయంగా మరోచోట భూమి ఇస్తామని రక్షణ శాఖకు హామీ ఇచ్చారు. కాగా, కేంద్రం బల్దియాలో విలీనానికి గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో కంటోన్మెంట్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ట్రాఫిక్ సమస్యలకు చెక్: సుమారు 3 వేల ఎకరాల మేర (27.5%) భూములు జీహెచ్ఎంసీకి రావడానికి అవకాశమున్నది. ఈ భూములు జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తే జాతీయ రహదారులతో పాటు రోడ్ల విస్తరణ, స్కై వే, ఫ్లై ఓవర్లు, సబ్ వేలు, రోడ్ అండర్ బ్రిడ్జిలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు తదితరాలను నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి చిక్కులు తొలుగుతాయి. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
కేసీఆర్ చిత్తశుద్ధికి నిదర్శనం: కంటోన్మెంట్ ప్రాంత విలీనం.. గత ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధికి నిదర్శనమని బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కంటోన్మెంట్ విలీనానికి ఎంతో కృషి చేసినట్లు ఎక్స్ ఖాతాలో వివరించింది. అప్పటి మంత్రి కేటీఆర్ చేసిన అవిశ్రాంత పోరాటాన్ని గుర్తు చేస్తూ బీఆర్ఎస్ స్పందించింది. రక్షణశాఖ మంత్రులు, రక్షణ శాఖ ఉన్నతాధికారులు, కేంద్ర మంత్రులకు రాసిన లేఖలు, కంటోన్మెంట్ ప్రజలందరికీ తెలుసని పేర్కొంది. కానీ ఒకరి శ్రమ ఫలితాన్ని తమ ఖాతాలో వేసుకునే పార్టీల కుసంస్కారం అందరికీ అర్ధం అవుతున్నదంటూ.. కంటోన్మెంట్ ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్, కేటీఆర్ జరిపిన చర్చల ఫొటోలను నెటిజన్లతో బీఆర్ఎస్ పంచుకోగా, కేటీఆర్ రీ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే కంటోన్మెంట్ ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీలో విలీనానికి తొందరగా చర్యలు తీసుకునేందుకు సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.