CBI | హైదరాబాద్లోని ఆర్జీఐ విమానాశ్రయంలో ముగ్గురు కస్టమ్స్ అధికారులపై సీబీఐ ఆదివారం కేసు నమోదు చేసింది. ఈ అధికారులపై విదేశీ కరెన్సీని అక్రమంగా రవాణా చేసేందుకు సహకరించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో నిజాంపేటకు చెందిన ఏ శ్రీనివాసులు, ఓల్డ్ బోయినపల్లికి చెందిన పంకజ్ గౌతమ్, కానాజీగూడకు చెందిన పేరి చక్రపాణిపై సీబీఐ అధికారులు కేసులు నమోదు చేశారు. గతేడాది మార్చి 16న శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ, భారత కరెన్సీని సీఐఎస్ఎఫ్, సీఐడబ్ల్యూ సిబ్బంది పట్టుకున్నారు.
రూ.4లక్షల భారత కరెన్సీని తీసుకెళ్తున్న నగరంలోని బహదూర్పురాకు చెందిన ప్రైవేటు వ్యక్తితో పాటు అతడి కుమారి వద్ద రూ.2,93,425కి సమానమైన వివిధ దేశాల కరెన్సీని నోట్లు ఉన్నాయంటూ సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. హైదరాబాద్లో మూడు, ఢిల్లీలో ఓ చోట నిందితులకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు జరిపి కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉందని అధికార వర్గాలు తెలిపాయి.