Hyderabad | హైదరాబాద్ : డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా బ్రీత్ అనలైజర్తో పరీక్షిస్తుండగా.. ఆ పరికరంతో పారిపోయిన క్యాబ్ డ్రైవర్ను హైదరాబాద్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అతడిని కే శ్రవణ్ కుమార్(27) అలియాస్ సన్నీగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తనిఖీలు చేస్తుండగా, వారిని పక్కకు నెట్టేసి బ్రీత్ అనలైజర్తో శ్రవణ్ కుమార్ పారిపోయినట్లు నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాల్ తెలిపారు. మొత్తానికి అతన్ని ఇవాళ అరెస్టు చేశామని చెప్పారు.
నిందితుడిపై 409/2024 U/s 353, 356, 379 ఐపీసీ సెక్షన్ల కింద బోయిన్పల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. నిందితుడి వద్ద బ్రీత్ అనలైజర్ పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్యం తాగి నడిపిన స్విఫ్ట్ డిజైర్ కారును కూడా సీజ్ చేశారు పోలీసులు.
గత గురువారం రాత్రి బోయిన్పల్లి పోలీసులు పుల్లారెడ్డి ఇంటి సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తున్నారు. ఇంతలో ఓ కారులోని డ్రైవర్ను పరీక్షిస్తుండగా, బ్రీత్ ఎన్లైజర్తో ఆ మందుబాబు ఉడాయించాడు. చీకటిగా ఉండటం.. కారు స్పీడ్గా వెళ్లడంతో అతను ఎవరనేది గుర్తించలేకపోయారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు బుధవారం అతన్ని అరెస్టు చేశారు.