సికింద్రాబాద్ : జంట నగరాల్లో బోనాలు (Bonalu) వేడుకలు ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్(MLA Padmarao Goud) అధికారులకు సూచించారు. గురువారం చిలకలగూడ లోని చారిత్రాత్మక కట్ట మైసమ్మ(Katta Maisamma) పోచమ్మ దేవాలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బోనాలు పనులను ప్రారంభించారు. తన వ్యక్తిగత విరాళంగా రూ.7 లక్షలను అందించి, కొత్త రంగులను వేసే పనులను లాంఛనంగా ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం హయాంలోనే బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించే ఆనవాయితీని ప్రారంభించామని తెలిపారు. ఆలయాలకు నిధులను అందించే పద్ధతిని తామే ప్రవేశపెట్టమని తెలిపారు. రూ.40 లక్షలను వినియోగించి ఆలయానికి అదనపు స్థలాన్ని సమకూర్చామని వివరించారు. నగరంలోనే అత్యధిక నిధులు కట్ట మైసమ్మ ఆలయానికి లభించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు.
ఆలయం లో ఈ నెల 28, 29 వ తేదిల్లో జరిగే బోనాలు వేడుకలను ఘనంగా జరుపుకోనేలా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని, రాజకీయాలకు అతీతంగా ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. ఆయన వెంట స్థానిక కార్పొరేటర్ హేమ, ఆలయ చైర్మన్ కృష్ణ, కార్యనిర్వహణాధికారి మహేందర్గౌడ్, నాయకులు రాజా సుందర్,బండారి మహేందర్ముదిరాజ్, సాయి యాదవ్, ఆలయం ట్రస్ట్ బోర్డు సభ్యులు దేవేందర్ యాదవ్ , నేతలు తదితరులు పాల్గొన్నారు.