TGPSC | సైదాబాద్, జూన్ 24: హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నియామకాల కోసం టీజీపీఎస్సీ సోమవారం నిర్వహించిన పోటీ పరీక్షలు అధికారుల నిర్లక్ష్యంతో ఆలస్యంగా ప్రారంభం కావడంతో అభ్యర్థుల తల్లిండ్రులు, బంధువులు నిరసన తెలిపారు. సైదాబాద్ మాతృశ్రీ ఇంజినీరింగ్ కళాశాల కేంద్రం వద్ద చేపట్టిన నిరసనకు మద్దతుగా ఆందోళన చేపట్టిన బీజేవైఎం నాయకులను సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన టీజీపీఎస్సీ పోటీ పరీక్ష.. కంప్యూటర్లు, సర్వర్లు మొరాయించడంతో రెండున్నర గంటలు ఆలస్యంగా మొదలైంది. దీంతో అభ్యర్థులు అయోమయానికి గురయ్యారు.
ఒకే పరీక్షా కేంద్రంలోని కొన్ని గదుల్లో పరీక్ష సజావుగా కొనసాగగా, మరికొన్ని గదుల్లో సర్వర్లు సతాయించడంతో అభ్యర్థుల తల్లిదండ్రులు, బంధువులు కలిసి పరీక్షా కేంద్రం బయట ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న బీజేవైఎం నాయకులు పరీక్షా కేంద్రానికి వచ్చి.. వారికి మద్దతుగా నిలిచారు. దీంతో పోలీసులు ఆందోళన చేపట్టిన బీజేవైఎం నాయకులు రమణ సింగ్, దినేశ్ గౌలిక్, ఆశీష్ గౌలికర్ తదితరులను అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్కు తరలించారు. సౌత్ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ స్వామి, సైదాబాద్ డివిజన్ ఏసీపీ వెంకన్న నాయక్, ఇన్స్పెక్టర్ రాఘవేందర్ పరీక్షా కేంద్రం వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేసి తగిన చర్యలు చేపట్టారు.
– టీజీపీఎస్సీ తరఫున పోటీ పరీక్షను నిర్వహిస్తున్న టీసీఎస్ సంస్థ సిబ్బంది నిర్లక్ష్యంతో సాంకేతిక సమస్య ఏర్పడిందని తెలిసింది. మాతృశ్రీ ఇంజినీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఏర్పడ్డ సాంకేతిక లోపం సమాచారం అధికారులకు తెలియడంతో ఈ పరీక్ష కేంద్రంలో ఆన్లైన్ పరీక్ష రాయని అభ్యర్థులందరికీ రీ షెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటించి, సంస్థ వైబ్సైట్లో సమాచారాన్ని ఉన్నతాధికారులు పొందుపర్చడంతో ఆందోళన విరమింపజేశారు.
మేడ్చల్, జూన్ 24 : హాస్టల్ సంక్షేమ అధికారి పరీక్ష నిర్వహణలో ఆలస్యం కావడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో ఈ ఘటన జరిగింది. టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో సోమవారం హాస్టల్ సంక్షేమ అధికారి పరీక్ష నిర్వహణకు మైసమ్మగూడలోని పలు ఇంజినీరింగ్ కళాశాలల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించిన ఈ పరీక్ష పేపరు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్- 2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగాల్సి ఉంది. అయితే ఆన్లైన్లో సమస్య తలెత్తడంతో దాదాపు 45 నిమిషాలకు పైగా ఆలస్యమైంది. దీంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. పేపరు- 2 పరీక్ష 5 గంటలకు ముగియాల్సి ఉండగా.. 6 గంటల వరకు జరిగింది.