GHMC | సిటీబ్యూరో, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్స్ల జారీలో అధికారుల మొద్దు నిద్రకు ఇదో మచ్చుతునక…ఆన్లైన్లో రూ. 350లు చెల్లిస్తే చాలు.. ఎలాంటి పత్రం లేకపోయినా, దుకాణం ఉందా? అనే అంశంతో సంబంధం లేకుండా, అధికారుల క్షేత్రస్థాయి విచారణ జరపకుండా ట్రేడ్ లైసెన్స్ జారీ అవుతుంది. అంతేకాదు అది ఏ వ్యాపారం, ఎవరు దరఖాస్తు చేసుకున్నారు? అనేది చూడకుండా లైసెన్స్ను మంజూరు చేస్తున్నారు. ట్రేడ్ లైసెన్స్ల జారీలో లోపాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.
ఇప్పటికే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేరిట మల్కాజిగిరి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం భవనానికి యజమానిగా పేర్కొంటూ.. నకిలీ ఇంటి నంబరును ఇచ్చేశారు. ఈ వ్యవహారంపై కౌన్సిల్ సమావేశంలో తీవ్ర దుమారం రేగింది. తాజాగా బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ట్రేడ్ లైసెన్సుల జారీలో లోపాలను ప్రత్యేక్షంగా ఎత్తిచూపారు. జీహెచ్ఎంసీ వెబ్సైట్లోని ఆన్లైన్ దరఖాస్తులో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేరును చేర్చి, డ్రగ్ మార్ట్ వ్యాపారాన్ని తెరిచేందుకు ఒక లైసెన్స్, మరొకటి ‘డ్రగ్స్ మార్ట్ ఇన్ కాంగ్రెస్’ పేరుతో కావాలంటూ పలు తెల్ల కాగితాలను అప్లోడ్ చేసి లైసెన్స్లు పొందడం గమనార్హం.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే..
గ్రేటర్లో ఏదైనా వ్యాపారం నిర్వహించాలంటే ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి. అధికారులతో సంబంధం లేకుండా పౌరులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని అప్పటికప్పుడే లైసెన్స్లు పొందేందుకు వీలుండటంతో తమకు కావాల్సిన లైసెన్స్ సర్టిఫికెట్లను సృష్టించుకునే అవకాశం కల్పించినట్లయింది. దీంతో కొందరు బల్దియా ‘ఇన్స్టాంట్ అప్రూవల్’ విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. నాలుగేండ్లలో రూ. 50కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. ట్రేడ్ లైసెన్స్ల జారీ విభాగాన్ని సమూల ప్రక్షాళన చేయాల్సిన అవసరమున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.