దుండిగల్/కుత్బుల్లాపూర్ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ. 3.97కోట్లలతో ప్రారంభించిన బాచుపల్లి ఫ్లైఓవర్ (Bachupally flyover) నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద (MLA KP Vivekananda) అధికారులకు సూచించారు. కొంపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాచుపల్లి ఫ్లైఓవర్, బాచుపల్లి, బౌరంపేట్, బహదూర్పల్లి, కొంపల్లి రోడ్డు విస్తరణ పనులపై హెచ్ఎండీఏ, జలమండలి, అటవి, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బాచుపల్లి నుంచి మల్లంపేట వరకు రూ. 1.64కోట్లలతో 1. 20 కి.మీ. రోడ్డు విస్తరణ పనులు, మల్లంపేట్ నుంచి బౌరంపేట్ వరకు రూ. 2.07 కోట్లలతో 4.80 కి.మీ. రోడ్డు విస్తరణ పనులు, గండి మైసమ్మ నుంచి బహదూర్పల్లి వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనుల్లో పురోగతిని సమీక్షించారు. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్థంభాల షిఫ్టింగ్ వంటి పనులను పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.
దీంతోపాటు మియాపూర్ నుంచి గండిమైసమ్మ వరకు ఉన్న 13.3కి.మీ రోడ్డు విస్తరణలో భాగంగా 1.50 కి.మీ, కొంపల్లి – బహదూర్పల్లి 7 కి.మీ మార్గంలో సుమారు రూ. 5.74 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు గాను అటవీశాఖ ఆధీనంలో ఉన్న 2.8 కి.మీ అటవీ భూములకు ఆ శాఖ నుండి అనుమతి తీసుకొని రోడ్డు విస్తరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్షలో నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ రామకృష్ణరావు, దుండిగల్ కమిషనర్ సత్యనారాయణ, కొంపల్లి కమిషనర్ శ్రీహరి, అధికారులు పాల్గొన్నారు.