మెహిదీపట్నం జూలై 4: తెలంగాణ ఆషాఢ మాసం బోనాలు జూలై 7వ తేదీన ప్రారంభం కానున్నాయి. కేవలం రెండు రోజులే మిగిలి ఉండగా, ప్రభుత్వ శాఖల అధికారులు ఏర్పాట్ల విషయంలో చాలా వెనుకబడి ఉన్నారు. చారిత్రాత్మక గోల్కొండ కోట జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ ఆలయంలో ప్రారంభమయ్యే తెలంగాణ ఆషాఢ మాసం బోనాలు నెల రోజుల పాటు కొనసాగుతాయి. జంట నగరాల నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించడానికి వస్తారు. గోల్కొండ కోటలో భక్తుల కోసం నీటి ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేయాల్సి ఉండగా, గురువారం మధ్యాహ్నం నుంచి నీటి ట్యాంకర్లను పెట్టడం ప్రారంభించారు.
క్యూలైన్ల కోసం బారికేడ్ల నిర్మాణంతో పాటు స్టేజీల ఏర్పాటు పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఇదిలా ఉండగా, గురువారం జీహెచ్ఎంసీ సర్కిల్-13 డిప్యూటీ కమిషనర్ శశిరేఖ, ఈఈ వెంకట శేషయ్య, డిప్యూటీ ఈఈలు రామకృష్ణ, జమీల్లతో కలిసి గోల్కొండ బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్ కాంత అరవింద్ మహేష్ కుమార్ పర్యవేక్షించారు. శనివారం సాయంత్రం వరకు మొత్తం పనులను ప్రభుత్వ శాఖల అధికారులు పూర్తి చేయాలని చైర్మన్ అరవింద్ మహేష్ కుమార్ సూచించారు. లంగర్హౌస్ చౌరస్తా సమీపంలో స్టేజి వేసే పనులు శనివారం సాయంత్రం నుంచి ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. లంగర్హౌస్లో జీహెచ్ఎంసీ ఈఈ వెంకటశేషయ్య పర్యటించి రోడ్ల గుంతల మరమ్మతుల పనులను వెంటనే పూర్తి చేస్తామన్నారు.
బోనాలకు అందుబాటులో బస్సులు
గోల్కొండ జగదాంబిక బోనాలకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.వెంకటేశ్వర్లు గురువారం పేర్కొన్నారు. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే, సీబీఎస్, పటాన్చెరు, ఈసీఐఎల్, మెహిదీపట్నం, దిల్షుక్నగర్, కూకట్పల్లి, చార్మినార్, ఉప్పల్, మల్కాజిగిరి, ఓల్డ్ బోయిన్పల్లి నుంచి 75 బస్సులు నడుపు తున్నామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్టు.. ఎంజీబీఎస్ – 90004 06069, మెహిదీపట్నం – 99592 26133, గోల్కొం డ – 99592 26031 ఫోన్ నంబర్లలో సంప్రదించొచ్చని చెప్పారు.