మేడ్చల్, జూలై 3 (నమస్తే తెలంగాణ): మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి వంద శాతం రాయితీపై చేప పిల్లలను చెరువుల్లో వదిలే ప్రక్రియపై సందిగ్ధం నెలకొన్నది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చెరువులలో చేపపిల్లల వదిలివేత కార్యక్రమంపై ఎలాంటి ప్రణాళికను సిద్ధం చేయకపోవడంతో మత్స్యకారుల్లో సందిగ్ధం నెలకొన్నది. అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకే చేప పిల్లలను వదిలే కార్యక్రమంపై ప్రణాళికను సిద్ధం చేసి.. టెండర్లను ఖరారు చేసే వారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం మారిన క్రమంలో నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు చేప పిల్లల వదిలివేతపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 232 చెరువులలో వంద శాతం సబ్సిడీపై గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 69 లక్షల చేపపిల్లలను చెరువుల్లో వదిలిన విషయం తెలిసిందే. జిల్లాలోని మత్స్యశాఖ ఆధీనంలో ఉన్న చెరువుల్లో చేపపిల్లలను వేసి స్థానిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు కౌలుపై ఇచ్చే ఆనవాయితీ కొనసాగుతూ వస్తున్నది.
చేప పిల్లల వదిలివేత ప్రక్రియకు సంబంధించి నూతన మార్గదర్శకాల తర్వాతే టెండర్లు ఖరారుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశమున్నదని తెలుస్తున్నది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం మార్గదర్శకాలపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్లు అధికారులకు సమాచారం లేదు. చేపపిల్లల వదిలివేతకు టెండర్లు ఇప్పటికే పూర్తయితే టెండర్లు పొందిన కాంట్రాక్టర్ చెరువులు 50 నుంచి 60 శాతం నిండిన వెంటనే చేపపిల్లను వేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు టెండర్ ప్రక్రియ పూర్తి కాని నేపథ్యంలో ఈ ఏడు చేప పిల్లలను చెరువుల్లో వదులుతారా? లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలంలో (68 చెరువులు), మేడ్చల్(77), కీసర (25), ఘట్కేసర్(18), కుత్బుల్లాపూర్(4), దుండిగల్ (24), బాచుపల్లి(5), అల్వాల్(2), కాప్రా (7), మేడిపల్లి (2) చెరువులున్నాయి. మత్స్యకారులు ఆర్థికాభివృద్ధికి ఎంతో ఉపయోగపడిన వంద శాతం రాయితీపై చేప పిల్లల వదిలివేత కార్యక్రమంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మత్స్యకార సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.