రూ.వెయ్యికే గజం.. 50 గజాలకు రూ.50 వేలు.. 100 గజాలు కావాలంటే లక్ష రూపాయలు… ఇదేదో మారుమూల ప్రాంతంలో కాదు..విజయవాడ జాతీయ రహదారికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోనే..కాకపోతే కొనుగోలు చేసిన తర్వాత ఈ స్థలంలోని గుడిసెలో కనీసం మూడు రోజుల పాటు నిద్ర చేయాలి. లేకపోతే మరుసటి రోజే అది వేరే వాళ్ల పేరు మీదకు మారుతుంది. మరి… ఇంతకీ ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్లు, పట్టాలు ఉంటాయా అంటే అవేవీ ఉండవు. అక్కడో ప్రైవేటు సైన్యం ఉంటుంది. వాళ్లు ఒక రిజిస్టర్లో పేర్లు నమోదు చేసుకుంటారు అంతే..
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 4 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కుంట్లూరు రెవెన్యూ పరిధి పాపాయిగూడలోని 214-225 సర్వేనంబర్లలోని భూముల వాస్తవ పరిస్థితి అది. నిజానికి ఈ భూమికి సంబంధించి టైటిల్ వివాదమే న్యాయస్థానంలో ఉంది. ఈ సర్వే నంబర్లలోని దాదాపు వందెకరాల భూములు తమవి అని కొందరు.. కాదు కాదు భూదాన్ బోర్డు ట్రస్టుకు రాసిన భూములు అని ట్రస్టు వాళ్లు వాదిస్తున్నారు. దీంతో ఏండ్ల తరబడి వివాదం న్యాయ స్థానంలోనే ఉన్నది. కానీ గత ఏడాది జనవరిలో రాత్రికి రాత్రే ఈ భూముల్లో వేలాది గుడిసెలు వెలిశాయి. ఇటీవల మియాపూర్లోని హెచ్ఎండీఏ భూముల్లోకి నిరుపేదలు తరలివచ్చినట్లే ఇక్కడ కూడా వందలాదిగా తరలివచ్చి గుడిసెలు వేసుకున్నారు.
కొంత కాలం ఉంటే ఆ స్థలం తమకు చెందుతుందనే ఆశతో ఇతర జిల్లాలు, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నిరుపేదలు వచ్చారు. కనీసం నీళ్లు, కరెంటు, ఇతరత్రా సాధారణ సౌకర్యాలు లేకున్నా.. నెలల తరబడి ఆ గుడిసెల్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు దళారులు అక్కడ రంగ ప్రవేశం చేశారు. ఉదయం వేళల్లో ఎక్కడ పనికి వెళ్లినా.. రాత్రికి మాత్రం తమ గుడిసెల్లోకి రావాల్సిందేనన్న నిబంధన విధించారు. ఎవరైనా రాత్రివేళల్లో గుడిసెల్లో నిద్రించేందుకు రాకుంటే వెంటనే ఆ గుడిసెను వేరే వారికి కేటాయిస్తున్నారు. దీంతో కొంతమంది అక్కడి నుంచి వెళ్లిపోగా… చాలామంది రోజంతా ఎక్కడ పని చేసినా.. రాత్రయ్యే సరికి అక్కడికి వస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాతపడిన వారు కూడా ఉన్నారు. కాగా, దళారులు గుడిసె వాసుల నుంచి క్రమంగా డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు. తొలుత రూ.5వేల నుంచి మొదలైన ఈ పర్వం ఇప్పుడు రూ. 50వేలు, లక్షల్లోకి వెళ్లింది.
ఎలాంటి హక్కులు లేకుండానే..
ఆ గుడిసెల్లో ఉన్న వారికి ఆ భూమి ఎవరిది? అనేది తెలియదు. కానీ కొన్నేండ్ల పాటు అక్కడే ఉంటే ప్రభుత్వం పట్టాలు ఇస్తుందనే ఆశతో అలాగే ఉంటున్నారు. అయితే గత కొన్నిరోజులుగా దళారుల ప్రమేయంతో ఆ గుడిసెలు చేతులు మారుతున్నాయి. సుమారు 40 చదరపు గజాల విస్తీర్ణంలో వేసిన గుడిసెలను గజానికి రూ. వెయ్యి చొప్పున విక్రయిస్తున్నారు. కాస్త విస్తీర్ణం ఎక్కువగా ఉంటే రూ. 50వేలు, రూ. లక్ష వరకు ధర పలుకుతున్నది. ఈ లావాదేవీలకు సంబంధించి ఎలాంటి పత్రాలు ఉండటం లేదు. కేవలం అక్కడ ఉండే దళారులు తమ రిజిస్టర్లలో పేర్లు నమోదు చేసుకుంటున్నారు. కొనుగోలు చేసిన వారు కూడా కచ్చితంగా రాత్రివేళల్లో అందులో నిద్రించాల్సిందే. వరుసగా మూడు రోజులు లేకుంటే.. అది వేరే వాళ్లకు విక్రయిస్తున్నారు.
ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్లో కూలీనాలీ చేసుకుంటున్న వాళ్లే ఇంత నీడ దొరుకుతుందనే ఆశతో మోసపోతున్నారు. వీటిపై రెవెన్యూ, పోలీసు శాఖలకు భారీ ఎత్తున ఫిర్యాదులు అందినా.. వేలాది మందిగా ఉన్న నిరుపేదలు.. పైగా ఆ ప్రాంతాన్ని అనధికారికంగా తమ చేతుల్లోకి తీసుకున్న ఒక ప్రైవేటు సైన్యం అధికార యంత్రాంగం మీద తిరగబడేందుకు సిద్ధమవుతున్నదని ఒక అధికారి తెలిపారు. కొన్నిరోజుల కిందట పోలీసులు భారీ బలగాలతో గుడిసెల తొలగింపునకు రంగం సిద్ధం చేసినా… విషయం తెలుసుకున్న గుడిసెవాసులు కారం, కర్రలతో తిరుగుబాటుకు సిద్ధం కావడంతో పోలీసులు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అనంతరం రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు వెళ్లి గుడిసెలను ఖాళీ చేయాల్సిందిగా వారిని హెచ్చరించారు. దీంతో గుడిసెవాసులు కొంతమంది సీఎం రేవంత్రెడ్డిని కలిసి అది భూదాన్ భూమి అయినందున ఇండ్ల స్థలాల కింద తమకు వాటిని కేటాయించాల్సిందిగా కోరారు.
గాడి తప్పుతున్న వ్యవస్థ..
గుడిసెలు వెలిసిన ప్రాంతం ఒక సామ్రాజ్యంగా మారడంతో పాటు అక్కడ కొందరు వలంటీర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు అనేక మంది బాధితులు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా విద్యుత్ సౌకర్యం కూడా లేకపోవడంతో రాత్రివేళల్లో పెద్ద ఎత్తున అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే విమర్శలున్నాయి. దీంతో గుడుంబా, గంజాయి వాడకం పెద్ద ఎత్తున జరుగుతుండటంతో శాంతిభద్రతలు గాడి తప్పుతాయనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. చోరీలు సైతం పెరిగినట్టు తెలుస్తున్నది. ఈ గుడిసెలో ఏం పోయినా ఎవరిపై ఫిర్యాదు చేయాలో కూడా తెలియక, కిమ్మనకుండా ఉండిపోతున్నట్టు సమాచారం. చోరీల విషయంపై బాధితులు స్థానిక నేతలకే ఫిర్యాదు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇక అక్కడ నిత్యం జరిగే గొడవలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. రాత్రి సమయాల్లో ఆ ప్రాంతం మీదుగా వెళ్లే వారు కూడా భయపడే పరిస్థితి నెలకొంది.