Anudeep Durishetti | సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ): ఓ చిట్టి తల్లి గుండెకు రంధ్రం.. ఇంకొకరికి బ్లడ్ ఇన్ఫెక్షన్.. ఇలా ఒక్కొక్కరు..ఒక్కో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల పరిస్థితులను తెలుసుకొని.. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఉద్వేగానికి గురయ్యారు. నిలోఫర్ ఆసుపత్రిని కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. నేరుగా వార్డుల్లోకి వెళ్లి వైద్య సేవలు జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. అక్కడికి వచ్చిన చిన్నారులు, తల్లిదండ్రులతో మాట్లాడి వైద్య సేవలు తక్షణం అందుతున్నాయా? లేదా? అని ఆరా తీశా రు. రెండున్నర గంటల పాటు ప్రతి ఒక్క వార్డును పరిశీలించారు.
అనంతరం నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణితో కలిసి ఇంటెన్సివ్ కేర్ బ్లాక్, డయాగ్నస్టిక్ ల్యాబ్, రక్త కేంద్రం, క్వాలిటీ కంట్రోల్ రూం, సీసీటీవీ, ఫిజియోథెరపీ, పిరియాడికల్ సర్జికల్ వార్డ్, ఆపరేషన్ థియేటర్ తదితర బ్లాక్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పుట్టుకతో వచ్చే లోపాలతో పిల్లలు జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితి రాకుండా వైద్యులు సకాలంలో వైద్యం అందించాలని సూచించారు.
చికిత్స అందించడంలో వైద్యులు నిర్లక్ష్యంగా ఉండకూడదని సూచించారు. అనంతరం కలెక్టరేట్లో రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమంపై ఎస్బీహెచ్ఓలు, ఆర్బీఎస్కే వైద్యులతో సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ వెంకట్, వైద్యులు ప్రసాద్, నాగజ్యోతి, రామ్ రెడ్డి, కల్యాణి శ్రీనివాస్, గంగా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కాగా, రెండ్రోజలుగా నిలోఫర్ దవాఖానను హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు సందర్శించారు. ఈనెల 2న నిలోఫర్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ స్థానిక ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి, ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డా.నరేందర్కుమార్లతో కలిసి హెడీఎస్ సమావేశం నిర్వహించారు. అంతకు ముందు కలెక్టర్ శశాంక్ దవాఖాన మొత్తం కలియతిరిగారు. రోగులకు అందుతున్న వైద్యసేవలు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయలను పరిశీలించారు.