Lotus Pond | సిటీబ్యూరో: బంజారాహిల్స్ రోడ్ నంబర్-12లోని ఎమ్మెల్యే కాలనీని ఆనుకొని ఉన్న లోటస్ పాండ్ బఫర్ జోన్ను ఆక్రమించి నిర్మాణాలకు సిద్ధమైన కబ్జాదారుల భరతం పట్టింది జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం. దాదాపు 2వేల గజాల వరకు స్థలాన్ని చదను చేసే ప్రయత్నంలో 500 గజాల వరకు పూర్తిగా భూమిని చదును చేశారు. దీనిపై స్థానికులు, ప్రకృతి ప్రేమికులు పెద్ద ఎత్తున జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఈవీడీఎం కమిషనర్ ఏవీ రంగనాథ్ లోటస్పాండ్ బఫర్ జోన్ ఆక్రమణ ప్రాంతాన్ని పరిశీలించారు.
జీహెచ్ఎంసీ నిర్మించిన కంపౌండ్ వాల్ను కూల్చివేసి , యథేచ్ఛగా కబ్జాకు పాల్పడుతుంటే ఇరిగేషన్, టౌన్ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారంటూ వారిపై రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టి కబ్జాదారుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని రంగనాథ్ ఆదేశించిన దరిమిలా ఈవీడీఎం విభాగంలోకి అసిస్టెంట్ ఇంజినీర్ సుజిత్ ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు లోటస్పాండ్ పార్కులోకి చొరబడి చెట్లను నరికి, జీహెచ్ఎంసీ కంపౌండ్ వాల్ను కూల్చివేసి భూమిని చదును చేసి ఆక్రమించేందుకు యత్నించాడన్న కారణంతో నార్నే గోకుల్పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. రంగనాథ్ అధికారులతో కలిసి పర్యటిస్తున్న సందర్భంగా లోటస్పాండ్ సమీపంలో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రంగనాథ్తో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.