మియాపూర్ , జూన్ 25 : ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక హెచ్చరించారు. శేరిలింగంపల్లి మండలం మియాపూర్ డివిజన్ ప్రశాంత్నగర్లోని సర్వే నం.100, 101లో ఇటీవల పెద్ద ఎత్తున ఆక్రమణలకు ప్రజలు తరలివచ్చిన నేపథ్యంలో, మంగళవారం సదరు భూములను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇండ్ల స్థలాలు పొందేందుకు దరఖాస్తు చేసుకునే విధానం ఉంటుందని, దానిపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. అందుకు భిన్నంగా తమకు తామే ప్రభుత్వ స్థలాలను ఆక్రమించేందుకు యత్నించటం సరికాదన్నారు. ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. హెచ్ఎండీఏ స్థలం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అలాగే కంచె ఏర్పాటు పనులను సత్వరమే ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ స్థల ఆక్రమణకు యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ వెంకారెడ్డి, అధికారులు ఉన్నారు.