NEET | “నీట్ను రద్దు చేయండి.. భావి పౌరుల భవితవ్యాన్ని కాపాడండి, ఎన్టీఏను వెంటనే రద్దు పర్చండి అంటూ నగరంలో శుక్రవారం సైతం పలు యూనివర్సిటీలలో విద్యార్థి సంఘాలు, పలు పార్టీల నేతలు పెద్ద పెట్టున నినదిస్తూ రాస్తారోకోలు, ధర్నాలు, ఆందోళనలు నిర్వహించాయి. దేశ వ్యాప్తంగా నీట్, నెట్ లాంటి పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఎన్డీఏ హెచ్ఆర్డీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్థి లోకంతో పాటు పలు పార్టీల నేతలు ఆందోళన బాట పట్టారు. ఇంత జరుగుతున్నా.. ప్రధాని మోదీ నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తున్నారని, ఇది సిగ్గుచేటని పలువురు నేతలు, విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.”
ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 21: దేశ వ్యాప్తంగా వైద్య విద్యలో చేరేందుకు నిర్వహించిన నీట్ పరీక్షలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, తక్షణమే దానిని రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ ఓయూ కార్యదర్శి నెల్లి సత్య డిమాండ్ చేశారు. యూజీసీ – నెట్ పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వివిధ విద్యార్థి, యువజన సంఘాల నాయకులతో కలిసి సత్య మాట్లాడుతూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్ కుమార్, ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్లు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు.
లేనిపక్షంలో అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. నీట్ సమస్య పరిష్కారానికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి చొరవ చూపాలని డిమాండ్ చేశారు. తెలుగు విద్యార్థులకు న్యాయం చేయలేకపోతే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలని హితవు పలికారు. శనివారం కిషన్రెడ్డి ఇంటిని ముట్టడించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, ఎన్ఎస్యూఐ, వీజేఎస్, ఏఐవైఎఫ్, డీవైఎఫ్ఐ, పీవైఎల్, యువజన కాంగ్రెస్, జన సమితి యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు.