Murder : హైదరాబాద్లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బేగంపేట పరిధిలోని పాటిగడ్డలో ఈ హత్య చోటుచేసుకుంది. నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేసి యువకుడిని హత్య చేశారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణంగా తెలుస్తున్నది. తన మరదలితో తిరుగుతున్నాడనే కారణంతో ఓ వ్యక్తి తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఈ హత్యకు పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే.. పాటిగడ్డ ప్రాంతానికి ఉస్మాన్ ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ వ్యవహారం యువతి బావ అజాజ్కు నచ్చలేదు. దాంతో అతను తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఉస్మాన్ హత్యకు ప్లాన్ వేశాడు. నలుగురూ మాటువేసి ఉస్మాన్ను కత్తులతో పొడిచిచంపారు. దాంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అనంతరం నిందితులు నలుగురు పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.