Hyderabad | వెంగళరావునగర్, జూలై 1: ‘మ్యాట్రిమోనీ’ యాప్ ద్వారా పరిచయమైన యువతిపై ఓ ప్రబుద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎస్ఆర్. నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పల్కు చెందిన ఓ యువతి (27) వివాహం కోసం మ్యాట్రిమోనీ యాప్లో నమోదు చేసుకోగా.. అందులో ఎస్ఆర్ నగర్ పరిధిలోని జయప్రకాశ్ నగర్కు చెందిన ఫొటో గ్రాఫర్ రాజశేఖర్ పరిచయమయ్యాడు. తాను పెండ్లి చేసుకుంటానని నమ్మించి పరిచయం పెంచుకున్నాడు. యువతికి చెందిన ఈ- మెయిల్ ఐడీని కూడా వినియోగించాడు. గత నెల 24న యువతికి ఫోన్ చేసిన రాజశేఖర్.. జయప్రకాశ్ నగర్లో ఉన్న తన ఫొటో స్టూడియోకు రమ్మని పిలిచాడు. మరుసటి రోజు స్డూడియోకు వెళ్లిన యువతిని బెదిరించాడు.
చెప్పినట్లు వినకుంటే తన మెయిల్ ద్వారా యువతికి చెందిన ఫొటోలను వైరల్ చేస్తానంటూ బెదిరించి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని హెచ్చరించాడు. బాధితురాలు అక్కడ నుంచి ఇంటికి చేరుకుని.. విషయాన్ని తన దగ్గరి బంధువైన మహిళతో చెప్పింది. వారు ఉప్పల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్కడ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ను ఎస్ఆర్. నగర్ పోలీసు స్టేషన్కు బదిలీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.