శామీర్పేట, జూన్ 28: ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి రెండేండ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని స్పోర్ట్స్ స్కూల్ ప్రాంగణంలో హెచ్ఎండీఏ శాఖ ఆధ్వర్యంలో నర్సరీని నిర్వహిస్తున్నారు. ఇందులో రోజువారీ కూలీలుగా మధ్యప్రదేశ్కు చెందిన రేష్మీ, సురేంద్ర దంపతులు పనిచేస్తున్నారు. రోజు వారీగా శుక్రవారం వీరు పనిలో నిమగ్నమవ్వగా, వీరి కుమారుడు మానవ్(2) సమీపంలోనే ఆడుకుంటూ..ప్రమాదవశాత్తు నర్సరీ కోసం తీసిన నీటి సంపులో పడి మునిగిపోయాడు. బాలుడిని బయటకు తీసి.. తూంకుంట, అల్వాల్లోని ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలుడు మృతి చెందినట్లు తెలిపారు.