Murder | హైదరాబాద్ : తన ప్రేమకు అడ్డు వస్తున్నాడని చెప్పి.. స్నేహితుడిని ఓ ఇంటర్ విద్యార్థి హత్య చేశాడు. ఈ హత్యను రైలు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులకు నిందితులు అడ్డంగా దొరికిపోయారు.
వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 23వ తేదీన మూసాపేట వద్ద రైలు పట్టాలపై డానీష్(17) అనే ఇంటర్ విద్యార్థి మృతదేహం లభ్యమైంది. దీంతో డానీష్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, తన కుమారుడు హత్యకు గురయ్యాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
డానీష్ సెల్ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నెల 22న రాత్రి 9.30 గంటలకు డానీష్కు స్థానిక రౌడీషీటర్ కుమారుడు(17) ఫోన్ చేసినట్లు విచారణలో తేలింది. ఇక మద్యం సేవించిన రౌడీషీటర్ కుమారుడు తన 8 మంది స్నేహితులతో కలిసి డానీష్పై బీరు సీసాలతో దాడి చేసి చంపారు. అనంతరం డెడ్బాడీని రైలు పట్టాలపై పడేసి వెళ్లిపోయారు నిందితులు. తన ప్రేమకు అడ్డు వస్తున్నాడని డానీష్పై రౌడీషీటర్ కుమారుడు పగ పెంచుకున్నాడని, ఈ క్రమంలో హత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. నిందితులు యూసుఫ్గూడలోని ఓ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నారు.