HICITY | సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి పేరిట కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, సీఆర్ఎంపీ పథకాల స్థానంలో కాంగ్రెస్ సర్కారు ‘హై సిటీ’ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్, ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’)కి రూపకల్పన చేసింది. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మౌలిక వసతుల కల్పనకు కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. సిగ్నల్ ఫ్రీ సిటీలో భాగంగా ఎస్ఆర్డీపీ కింద ఫ్లై ఓవర్లు, ఆర్యూబీ, ఆర్వోబీలు, ఇతర రోడ్ల విస్తరణ 42 పనులు చేపట్టి అనతికాలంలోనే 35 ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చి.. ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపింది. ప్రస్తుతం 7 చోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. నాలాల అభివృద్ధికి ఎస్ఎన్డీపీ పథకాన్ని రూ. 985.45కోట్లతో చేపట్టిన మొదటి విడతలో రూ.592.68 కోట్లు ఖర్చు పెట్టి 39 చోట్ల పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసింది. మిగతా పనులు పురోగతిలో ఉన్నాయి. సీఆర్ఎంపీ మొదటి విడతను తీసుకొచ్చి గుంతలు లేని నగరంగా తీర్చిదిద్దింది. అయితే సీఆర్ఎంపీ, ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ రెండో విడత పథకాలకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి.. ప్రభుత్వ పరిశీలనకు పంపారు. ఇంతలో బీఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పాత పథకాల పేర్లు వినియోగంలోకి లేకుండా కొత్తగా హై సిటీ కింద అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చింది. నిధుల సమీకరణపై మాత్రం స్పష్టత లేకుండానే నాలా రెండో దశ పనుల ప్రతిపాదనలు సిద్ధం చేయడం గమనార్హం.
గ్రేటర్లో కనీస సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పన సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ సర్కారు హై సిటీ పథకానికి రూపకల్పన చేసింది. గత ప్రభుత్వ కాలంలో వివిధ వ్యూహాత్మక పథకాల పేరుతో ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించారు. ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, సీఆర్ఎంపీ ద్వారా గ్రేటర్లో ప్రస్తుతం పురోగతిలో ఉన్న పనులను పూర్తి చేయడం, మరింత అభివృద్ధికి నూతన పనులను ప్రతిపాదిస్తూ..ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రాధాన్యత పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. వివిధ పథకాలను అమలు చేసే బదులు ఒకే గొడుగు కింద సమగ్రాభివృద్ధికి సర్కారు ‘హై సిటీ’కి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కాగా, నాలాల అభివృద్ధిలో భాగంగా ఎస్ఎన్డీపీ మొదటి విడత పూర్తి కాగానే ఆ పేరు వాడకంలో ఉండదు. ఈ క్రమంలో రెండో విడతలో రూ. 582.42 కోట్లతో 35 చోట్ల పనులు చేపట్టేందుకు ‘హై సిటీ’ కార్యక్రమం కింద చేపట్టనున్నారు. అయితే నిధుల సమీకరణపై స్పష్టత లేకుండా జోన్ల వారీగా చేపట్టే పనుల వివరాలను బుధవారం వెల్లడించారు.