దుండిగల్, జూలై 1: వరుసగా చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న నిందితుడిని బాలానగర్ ఎస్ఓటీ, బాచుపల్లి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ద్విచక్ర వాహనంతో పాటు ఆరు తులాల బంగారు గొలుసులను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. బాలానగర్ డీసీపీ సురేశ్కుమార్, కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాస్రావు, బాచుపల్లి ఇన్స్పెక్టర్ ఉపేందర్ సోమవారం సాయంత్రం బాచుపల్లి పీఎస్లో వివరాలను వెల్లడించారు. రాజస్థాన్కు చెందిన మహేందర్సింగ్ (42) గతంలో సైబరాబాద్ పరిధిలో హోంగార్డుగా పనిచేశాడు. ఈ నేపథ్యంలో పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాలపై అవగాహన ఉంది. డ్యూటీ చేస్తున్న సమయంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరు కలిసి మద్యం సేవించడంతో పాటు జల్సాలను తీర్చుకునేందుకు దొంగతనాలు, చైన్స్నాచింగ్లు మొదలుపెట్టాడు.
బాలానగర్, జీడిమెట్ల, సనత్నగర్, కూకట్పల్లి, కేపీహెచ్బీ, మియాపూర్, పేట్బషీరాబాద్, అల్వాల్ పీఎస్ల పరిధిలో మొత్తం 36 దోపిడీలు, స్నాచింగ్లకు పాల్పడ్డాడు. దీంతో మహేందర్సింగ్ను పట్టుకున్న జీడిమెట్ల పోలీసులు అతడిపై పీడీ యాక్టు నమోదు చేసి, జైలుకు పంపించారు. 2017లో జైలు నుంచి విడుదలైన అతడు.. రూ. లక్షన్నర అప్పుచేసి పల్సర్ బైక్ తీసుకున్నాడు. ఈఎంఐలు చెల్లించడంలో ఇబ్బందులు రావడంతో తిరిగి చైన్స్నాచింగ్లు చేయడం మొదలుపెట్టాడు. జూన్ 24న బాచుపల్లి పీఎస్ పరిధిలోని ఇన్కాయిస్ చౌరస్తాలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసును అపహరించుకుని పారిపోయాడు. ఆ మరుసటి రోజు జీడిమెట్ల పీఎస్ పరిధిలో మరో మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును తెంచుకునేందుకు యత్నించి విఫలమయ్యాడు. అయితే అదేరోజు జూన్ 25న జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలోని ఉషోదయకాలనీలో ఓ మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసును అపహరించి పారిపోయాడు.
రెండు రోజుల వ్యవధిలోనే మూడు స్నాచింగ్లు జరగడంతో పోలీసులు ఈ కేసులను సీరియస్గా తీసుకున్నారు. బాలానగర్ డీసీపీ ఆదేశాల మేరకు బాలానగర్ ఎస్వోటీ డీసీపీ శ్రీనివాస్ పర్యవేక్షణలో దర్యాప్తును ముమ్మరం చేశారు. నేరాలు జరిగిన ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ప్రగతినగర్ ఇన్కాయిస్ చౌరస్తా వద్ద జరిగిన స్నాచింగ్ సమయంలో ఓ వ్యక్తి ముఖానికి మాస్క్ ధరించి, నల్లని పల్సర్ బైక్పై వచ్చినట్లు గుర్తించారు. అదే వ్యక్తి, అదే బైక్పై మరుసటి రోజు తలకు హెల్మెట్ పెట్టుకుని గొలుసులు దొంగిలించినట్లు నిర్ధారణ కావడంతో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు మరింత ముమ్మరంగా దర్యాప్తు కొనసాగించారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం బాలానగర్ ఎస్ఓటీ, బాచుపల్లి పోలీసులు కలిసి బాచుపల్లిలోని మమత వైద్యశాల వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మహేందర్సింగ్ పట్టుబడ్డాడు. విచారణలో మూడు చోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడింది తానేనని అంగీకరించడంతో పోలీసులు అతడి వద్ద నుంచి ఆరు తులాల బంగారు గొలుసులు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని రిమాండ్కు తరలించారు.