సిటీబ్యూరో, జూన్ 28(నమస్తే తెలంగాణ): ‘మీ పేరు మీద డ్రగ్స్ సరఫరా జరుగుతోందం’టూ నగరవాసిని సైబర్ నేరగాళ్లు బెదిరించడమే కాకుండా అతడి ఖాతా నుంచి రూ. 18 లక్షలు స్వాహా చేశారు. అయితే తనకు జరిగిన మోసాన్ని పసిగట్టిన బాధితుడు.. పోలీసులకు ఫిర్యాదు చేయగా, వెంటనే నగర సైబర్ క్రైమ్ పోలీసులు.. సైబర్నేరగాళ్ల ఖాతాలోకి వెళ్లిన డబ్బులను కేవలం 11 నిమిషాల్లోనే ఫ్రీజ్ చేయగలిగారు. అంబర్పేటకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్కు ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి, తాను ఫెడెక్స్ కొరియర్ ఏజెన్సీ నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పాడు. ‘ఎవరో మీ ఆధార్ కార్డును ఉపయోగించి.. ముంబై నుంచి ఇరాన్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు’ అని తెలిపాడు. ‘మీరు ముంబై సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించండి’ అంటూ వెంటనే స్కైప్ ద్వారా మరో వ్యక్తితో మాట్లాడించాడు. ఆ తర్వాత సదరు గుర్తు తెలియని వ్యక్తి బాధితుడితో మాట్లాడుతూ.. విచారణలో భాగంగా కొంత డబ్బు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, వెరిఫికేషన్ తరువాత ‘మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తామ’న్నాడు. అయితే తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో పర్సనల్ లోన్ తీసి చెల్లించాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించాడు.
దీంతో భయాందోళనకు గురైన బాధితుడు.. బ్యాంక్ నుంచి రూ. 18 లక్షల పర్సనల్ లోన్ తీశాడు. నిందితులు సూచించిన అకౌంట్కు బదిలీ చేశాడు. కానీ ఎంతకూ తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు.. వెంటనే ఈనెల 27న నగరంలోని సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. అదే సమయంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న డ్యూటీ కానిస్టేబుల్ శ్రీకాంత్ నాయక్ వెంటనే ఫిర్యాదు స్వీకరించారు. ఎన్సీఆర్పీ పోర్టల్లో కేసు నమోదు చేయడంతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్తో పాటు బాధితుడి అకౌంట్ నుంచి డబ్బు మార్పిడి జరిగిన సైబర్ మోసగాళ్ల ఖాతాలన్నింటినీ ఫ్రీజ్ చేశారు. ఈ క్రమంలోనే బాధితుడి అకౌంట్ నుంచి నిందితుడి ఖాతాలోకి బదిలీ అయిన రూ. 18 లక్షల ఫ్రీజ్ అయ్యాయి. సమయస్ఫూర్తి, సమర్థతతో పనిచేసి బాధితుడికి చెందిన డబ్బులను సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా కేవలం 11 నిమిషాల్లోనే చర్యలు తీసుకున్న కానిస్టేబుల్ శ్రీకాంత్ నాయక్ను ఈ సందర్భంగా సైబర్క్రైమ్ డీసీపీ అభినందించారు. విధి నిర్వహణలో సమర్థత చాటుకున్నందుకు రివార్డును ప్రకటించారు.