హైదరాబాద్ : రక్షణగా ఉండాల్సిన పోలీసులే భక్షకులుగా మారుతున్నారు. కంచే చేను మేసింది అన్న చందంగా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మొన్న కాళేశ్వరంలో సీఐ, నిన్న నల్లగొండలో ఎస్ఐ లైంగిక దాడి ఘటనలు మరవక ముందే తాజాగా రాజేంద్రనగర్లో ఓ కానిస్టేబుల్(Constable) బాలికను ట్రాప్ చేసి (Cheated girl)లైంగికదాడికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్ ఆర్.జి.ఏ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ప్రదీప్ అనే కానిస్టేబుల్ బుద్వేల్లో తన ఇంటికి ఎదురుగా నివసిస్తున్న మైనర్ బాలికను మాయమాటలతో నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. లైంగిక దాడి చేయడమే కాకుండా వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతూ పలుమార్లు ఈ కిరాతకానికి ఒడిగట్టాడు. దీంతో సదరు బాలిక తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గతంలోనూ లైంగిక వేధింపుల ఆరోపణలపై సదరు కానిస్టేబుల్ సస్పెండ్ అయినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఆరునెలల క్రితందాకా శాంతి భద్రతలకు చిరునామాగా ఉన్న తెలంగాణలో ఒక్కసారిగా పరిస్థితి అదుపుతప్పినట్టు కనిపిస్తున్నది.
పేట్రేగిపోతున్న సైబర్ ముఠాలు, ఏకంగా ఐపీఎస్ల కుటుంబసభ్యుల నుంచే దోపిడీలు.. చెలరేగుతున్న హంతకులు, ఒక్క జూన్ నెలలోనే 26 హత్యలు, మత ఘర్షణలు, డ్రగ్స్ ముఠాలు, దారిదోపిడీ, చైన్ స్నాచింగులు ఇలా ఎన్నో నేరాలూ-ఘోరాలు. హోంశాఖకు పూర్తిస్థాయి మంత్రి లేకపోవడం, ప్రస్తుతం బాధ్యతల్లో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు విఫలం కావడం, వ్యవస్థాగత సమీక్షలను పక్కనబెట్టడం, శాంతిభద్రతల పరిరక్షణపై క్రమంతప్పకుండా చేయాల్సిన పనులు చేయకపోవడం ఇందుకు కారణాలని సీనియర్ ఐపీఎస్లు విశ్లేషిస్తున్నారు.
పోలీసు విభాగంపై సర్కారుకు పట్టుతప్పినట్టు కనిపిస్తున్నదని పోలీస్ స్టేషన్లలోనే సెటిల్మెంట్లు, భూదందాలు జరుగుతన్నాయని, ఈ ఏడాది ఏసీబీ అధికారులు నమోదుచేసిన కేసుల్లో 20కి పైగా పోలీసులవే ఉండగా దాదాపు 35 మంది వరకు పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారని వారు గుర్తుచేస్తున్నారు. 30మందికి పైగా సీఐలు, ఎస్ఐలు సస్పెండ్ అవడం పరిస్థితి తీవ్రతకు సూచిక అని విశ్లేషిస్తున్నారు.