Jelamandali | సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ ) : జలమండలిలో నీటి దోపిడీ జరుగుతోందా? సంస్థ నెలవారీగా ఆదాయానికి భారీగా గండి పడుతుందా? ఇందుకు కొందరు అధికారులు ఏఎంఆర్ మీటర్లను కేంద్రంగా చేసుకున్నారా? అంటే బోర్డు వర్గాల నుంచి అవుననే సంకేతాలు వస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లోని ఒక అంగుళం, ఆపై పరిమాణం ఉన్న నల్లా కనెక్షన్లకు ఆటోమెటిక్ మీటర్ రీడింగ్ (ఏఎంఆర్) విధానం జలమండలి అమలు చేస్తున్నది. సంస్థకు ప్రధాన ఆదాయ మార్గాలైన కంపెనీలు, వ్యాపార, వాణిజ్య సంస్థలకు సంబంధించి ప్రతి నీటి బొట్టునూ పక్కాగా లెక్కించేందుకు ఏఎంఆర్ మీటర్లను అమర్చింది. సంస్థ పరిధిలో 12,200 ఏఎంఆర్ మీటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో మీటరుకు సుమారు రూ.30వేలకు పైగా ఖర్చు చేశారు. అయితే చాలా చోట్ల ఏఎంఆర్ మీటర్ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదు. ఏజెన్సీల నుంచి వచ్చే కమీషన్లతో నాణ్యత లేని కంపెనీల మీటర్లను అధికారులు ఎం ప్యానల్ చేశారు. ఫలితంగా ప్రస్తుతం 1200 మీటర్లు పనిచేయడం లేదు. దీంతో సంస్థకు రెవెన్యూ నష్టం వాటిల్లుతున్నది. వాస్తవానికి ఏఎంఆర్ మీటర్లతో సంస్థకు నెలవారీగా రూ. 45 కోట్ల మేర ఆదాయం వస్తున్నది. కానీ వెంటిలేటర్లో ఉన్న ఈ ఏఎంఆర్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తే సంస్థకు అదనంగా 20 శాతం మేర ఆదాయం వస్తుందని స్వయంగా అధికారులే చెబుతుండటం గమనార్హం.
సంస్థ పరిధిలో 25 ఎంఎం, ఆపై నల్లా కనెక్షన్లకు ఏఎంఆర్ మీటర్ తప్పనిసరి. ఇందుకు సంస్థకు సంబంధించి మూడు ఏజెన్సీలకు ఈ ఏఎంఆర్ మీటర్ల బాధ్యతలు అప్పగించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఎంఆర్ మీటరింగ్ వ్యవస్థ పనిచేస్తుంది. వాడిన ప్రతి నీటి బొట్టుకు లెక్కించవచ్చు. రోజూ ఎంత నీరు ఇస్తున్నాం? అందుకు తగ్గ రెవెన్యూ వచ్చిందా? లేదా అన్నది రోజూ వారీగా చూసుకునే వీలు ఈ ఏఎంఆర్ మీటర్తో తెలుస్తుంది. కనెక్షన్ తీసుకునే సమయంలో వినియోగదారుడి నుంచి ఏఎంఆర్ మీటర్కి రూ. లక్షలు వసూలు చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ మీటర్ల నిర్వహణలో మాత్రం సదరు ఏజెన్సీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఏఎంఆర్ మీటర్ తీసుకుంటే ఐదేండ ్లగ్యారంటీ అంటూ అంటగడుతున్నారు. ఏజెన్సీ నుంచి తీసుకున్న వినియోగదారుడికి మీటర్ పనిచేయక..ఏజెన్సీ చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం ఉండటం లేదు.
పైగా మీటర్ రిపేరు అంటూ పెద్ద మొత్తంలో జలమండలి జారీ చేసిన బిల్లులపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న వినియోగదారుడు.. చివరకు పనులు మానుకొని నల్లా బిల్లుల సమస్యను పరిష్కరించుకోలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అయితే ఏజెన్సీలు, కొందరు అధికారుల తీరుతో ఏఎంఆర్ వ్యవస్థ సక్రమంగా నిర్వహించలేక..ఇందులోనే చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఏఎంఆర్ మీటర్లు నాణ్యతగా ఉండటం లేదు. ఎక్కువ శాతం చైనా ఉత్పత్తులను వినియోగిస్తుండడంతోనే ఈ మీటర్లు పనిచేయడం లేదు. మీటర్ రిపేర్ల కోసం ఎన్నిసార్లు ఫిర్యాదులు వెళ్తున్నా.. ఏజెన్సీల నుంచి కనీస స్పందన ఉండటం లేదని వినియోగదారులు మండిపడుతున్నారు. సదరు ఏజెన్సీలపై నామమాత్రంగా నోటీసులు ఇస్తూ చర్యల విషయంలో వెనుకంజ వేయడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్ శాఖ తరహాలో క్వాలిటీ మీటర్ రీడింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.